Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

శ్రీ మాత్రేనమః
గురవేకుసుమాంజలి

కరుణాశక్తి కల్లోల కరుణాకలితాత్మనే |

పరానుగ్రహరూపాయ గురవే కుసుమాంజలిః ||

అనుత్తర మహాసంవి దనుభూతి కళాత్మనే |

గురుగంధగుణాఢ్యాయ గురవే కుసుమాంజలిః ||

నిజస్తుతి నమఃస్కార నిరస్తదురహంకృతే |

విద్యాగమరహస్యాయ గురవే కుసుమాంజలిః ||

ఇది జగద్గురుబోధలు పదవభాగం. దీనితో కామకోటి సరస్వతి 'దశముద్రా సమారాధ్య' అయినది.

ప్రథమభాగం దాదాపు పద్దెనిమిదేళ్ళ క్రితం ప్రచురింప బడ్డది. ఈనాడు పదోభాగం మీ చేతుల కందివ్వటం ఎంతో సంతోషంగా వున్నది. ఈ సంతోషం నాకూ బులుసువారికే కలిగించినందులకు కామకోటి సరస్వతికి హృదయపూర్వక వందనములు.

పందొమ్మిదేళ్ళ క్రితం ఎగ్మూరునుండి ప్రయాణం చేస్తూ లాల్‌గుడి అనే స్టేషనులో దిగాను. సమయం ఉదయం నాలుగు గంటలు. రాత్రి సరిగా నిద్రలేదు. స్వామివారు లాల్‌గుడి స్టేషనుకు దాదాపు మూడు మైళ్ళదూరంలో ఏదో ఒక గ్రామంలో ఉన్నారు. సన్యాసి గ్రామైకరాత్రంగా గడపాలని శాస్త్రం. వీరు సన్యాసియే కాదు. మఠాధిపతి కూడా ఆ చోట ఎన్ని రోజులుగా ఉన్నారో తెలియదు.

శ్రీరాములవారికి పట్టాభిషేకమైనది. యుద్ధం కాగానే శ్రీరాములవారితో వానరులందరూ అయోధ్యకు వచ్చారు. విభీషణుడూ వానరులూ శ్రీరాముల వారి వద్ద సెలవు తీసుకొని లంకకూ, కిష్కింధకూ వెళ్ళవలసిన సమయం. కానివారికి ఆమోహన రాముణ్ణి వదిలి పోవడానికి మనసు రావటం లేదు.

కృతప్రసాదా స్తేనైవం రాఘవేణ మహాత్మనా |

జగ్ము స్స్వంస్వంగృహం సర్వే దేహీ దేహ మిపత్యజన్‌ ||

అవసానకాలంలో దేహమును వదలడానికి దేహి ఎంత తికమకలు పడుతాడో ఆ విధంగా వుందట వారి అవస్థ. స్వాముల వారు వచ్చి వెళ్ళితే గ్రామస్థుల స్థితీ అంతే !

నేను అ మసక మసక చీకట్లో నడుస్తున్నాను. బాట కిరువైపులా టెంకాయచెట్లు సుదీర్ఘంగా పెరిగి ఉన్నాయి. వరిపొలాల నుంచి చల్లని గాలి అనతిదూరంలో అమ్మ కావేరి ప్రవహిస్తున్నది వేగుచుక్క పొడిచినా ప్రాణికోటి ఇంకా నిద్రాభూతంగానే ఉన్నది. స్వాములవారి చిరునవ్వులను తలచుకొంటూ నడుస్తున్నా హృదయం ఉరకలు వేస్తున్నది. ఈ సన్యాసికీ నాకూ ఏమీ సంబంధం? ఈయనెవరు? నేనెవరు? ఈ మా సంబంధం ఏ నాటిది ?

బహూని మే వ్యతీతాని జన్మాని తన చార్జున |

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||

అని శ్రీ కృష్ణ భగవానుడు అంటున్నాడు.

నా జన్మలు నాకు తెలియవు. ఈ సన్యాసి ఎఱుగునా? క్రియాబహుళ##మైన నా జీవితంలో ఈ సన్యాసి అకస్మికంగా వచ్చి, తిష్ఠ వేసి, నన్నిట్లు ఎందుకు బలవంతంగా లాక్కొని వెడుతున్నాడు? నా గమ్యస్థాన మేమి? ఊహూ! తెలియదు.

కాని హృదయం ఆనందంగా ఉంది. చల్లని గాలి, ఆకాశం నల్లమబ్బులూ, తెల్లమబ్బులూ వేగుచుక్క ఇంకా మినుకుమినుకు మంటూనే ఉన్నది. వామనుని చేతిలో కన్ను లొట్టపోయినా, ఈ శుక్రాచార్యుల వారి కేమికళ? నేను 'గురువు' వద్దకు కదా వెడుతున్నాను. నాకు శుక్రునితో పని ఏమి?

స్వామి 'అనూరాధ' అనూరాధ - ఎంత మంచిపేరు, ఆ నక్షత్రం పేరులోనే ఒక సొగసున్నది. దాని అధిదేవతం మిత్రుడు. రాశి వృశ్చికము.

ఋద్ధా స్మ హవైర్య ర్న మసోపసద్య | మిత్రం దేవం మిత్ర ధేయ న్నో అస్తు| అనూరాధాన్‌ హవిషా వర్ధయంతః | శతం జీవేమ శరద స్సవీరాః | చిత్రం నక్షత్ర ముదగా త్పురస్తాత్‌ | అనూరాధా స ఇతి య ద్వదంతి త న్మిత్ర ఏతి పధిభి ర్దేపయానై ః హిరణ్యాయై ర్వితతై రంతరిక్షే ||

నేనో 'విశాఖ'ను - నేనూ వృశ్చికమే.

దూర మస్మ చ్ఛత్రవో యంతు భీతాః | తదీంద్రాగ్నీ కృణుతాం త ద్విశాఖే | తన్నో దేవా అనుమదంతు యజ్ఞం పశ్చాత్పు రస్తా దభయ న్నో అస్తు | నక్షత్రాణా మధిపత్నీ విశాఖే | శ్రేష్ఠా వింద్రాగీ%్‌న భువనస్య గోపౌ | విషూచ శ్శత్రూ నపబాధమానౌ | అపక్షుధ న్నుదతా మరాతిమ్‌||

నేను విశాఖను. స్వామి అనూరాధ. నాకు స్వామి సంపత్తార. స్వామికి నేను పరమమిత్రతార ! వారూ మిత్రతారనే ! గురువుతో అద్వైతమా?... ఏదో చీకట్లో సందడి. ''పశ్చాత్‌ పురస్తాత్‌ అభయన్నో అస్తు!'' పరమమిత్రులైన ఆచార్యుల అనుగ్రహమే వుంటే మనం వెళ్ళవలసినది దేవ యానమేకదా! 'తమసో మా జ్యోతిర్గమయ'.

గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో రెండు మూడు వీధులకు మించి లేవు. గ్రామస్థుల జలవసతి కోసం కావేరినుంచి త్రవ్వి తీసిన కాలువలో పాదప్రక్షాళనం చేసుకొని స్వామి వారి విడిదికి దారి తీసినాను. ఆ సరికే దర్శనానికి జనం కూడి వున్నారు. వసారాలో త్రిపురాంకిత మస్తకులై ఒక పీట మీద పరమేశ్వరుని వలె స్వామి కూచుని ఉన్నారు.

స్వాములవారిని చూడగానే ఒక ఉదంతం స్మృతి పథంలో మెరిసింది.

సంవత్సరం 1934 మా తండ్రి స్టేషన్‌మాష్టరుగా పనిచేస్తున్నారు. పాకాల ధర్మవరం లైనులో 'మలకవేమల' అన్నచోట. ఈ స్టేషను కదిరి దాటగానే వస్తుంది. నాకు ఏడేళ్లు. ఒకరోజు సాయంత్రంమా తండ్రిగారు గబగబావచ్చి మా అమ్మతో అన్నారు. ''స్వాములవారు 'ముదిగుబ్బ' వదలి వస్తున్నారట. మన ఇంటికి వెనకవున్న రోడ్డుమీద వెడుతారు. మనం దర్శనానికి వెడుదాం'' అని. ఎక్కడకో వెడుదా మని ఉత్సాహమేకానీ, స్వాములు, సన్యాసులును గూర్చి తెలియని వయస్సునాది.

ఒక అరగంటసేపు కాచుకోగా పల్లకివచ్చింది. దానిలో ఒక స్వాముల వారున్నారు. మా అమ్మ హారతి ఇవ్వగా నాకు స్వాములవారు కలకండ ఇచ్చినట్లు గుర్తు. వారి పేరూ వివరాలూ తెలియవు. ఇప్పటికీ సందేహమే. ఆ వచ్చినవారు శృంగేరిస్వాములా, వీరా? అని, వారినే అడిగితే తేలిపోతుంది. అని అడిగాను.

కంప్యూటర్‌లో డాటా బ్యాంక్‌ అని వుంటుంది. అదీ కొన్ని సెకన్డుల వ్యవధిలో - స్మృతిని (ః|పుసా) తెచ్చుకొంటుంది కాని ఈ సన్యాసి తడుముకోలేదు.

''ఔను మేము, ఆరోజు సాయంత్రం 'చిన్న తిప్పసముద్రం' అనే గ్రామంలో విడిదిచేశాము.''

ఎక్కడ 1?34 ? ఎక్కడ 1961 ? ఇరవైఏడేళ్ళు క్రితం ఒకానొకరోజు, ఒకానొక సాయంత్రం ఫలాని వూరిలో - రోజూ ఊరు ఊరూ తిరిగే ఈ మనిషి-విడిది చేశారట!

ఆ సందర్భంలోనే నేను వారిని, అరవ భాషలో ఉన్నవారి ప్రవచనాలను, ఆంధ్రీకరణ చేయాలని కోరటం, వారు అనుమతించటం, పిదప అనువాదాలు శ్రీయుతులు నీలం రాజు వెంకట శేషయ్యగారి సౌజన్యం వలన ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురింపబడటం -సాధన గ్రంథ మండలి వానిని పుస్తకరూప మొందించటం - ఇవన్నీ తరువాతి విషయాలు.

నాకు ఆ రోజుల్లో బులుసువారిని తెలియదు. 'అయ్యా! మిరీ ప్రవచనాలను ముద్రిస్తారా?' అని వారికి ఒక జాబు వ్రాశాను. ఆయన వెంట వెంటనే ఉత్తరాలు వ్రాయటంలో ఆరితేరిన మనిషి. ఆయన సమ్మతించారు. వారిని కలుసుకోవటమూ ఒక తమాషాగా నడచింది. నేను ఉదయం 5 గంటలకు జి.టీ. బండిలో దిగగా, ఆయన స్టేషనుకు వచ్చి నన్ను కనిపెట్టలేక ఇంటికి తిరుగుముఖం పట్టారు. నాకు తెనాలి క్రొత్త. కొంతసేపు వేచివుండి, స్టేషను బయటకురాగానే ఒక అరవవాడు - 20 ఏళ్లుంటాయి, పిచ్చివాడు హఠాత్తుగా నాకు ఎదురయ్యాడు.

మా సంభాషణ ఈలా నడచింది.

''ఉళ్ళె యిరుక్కిర ఓళియుం, వెళియిల్‌ యిరుక్కిర ఓళియుం ఒన్రుదాన్‌. నాన్‌ యారో తెరియుమా?''

(లోన ఉన్న ప్రకాశమూ, బయట ఉన్న ప్రకాశమూ ఒక్కటే ! నే నెవరో తెలుసునా ?)

'ఎనక్కు తెరియాదు' (నాకు తెలియదు)

'అంద కన్నాడియై ఎడుత్తు పార్‌' (నీవు వేసుకొన్న కళ్ళజోడును తీసిచూడు.)

నేను ఆ పిచ్చివాని మాటలకు లొంగి కళ్ళజోడును తీశాను.

'నాన్‌ మురుగన్‌ నీ వంద కార్యం వెట్రియాగుం'

(నేను సుబ్రహ్మణ్యుడను. నీవు వచ్చిన కార్యం జయం మౌతుంది.) ఆ పిచ్చివాడు గబ గబ వెళ్ళిపోయాడు.

బాలోన్మత్త పిశాచవత్‌. అతడు పిచ్చివాడో, మహాత్ముడో దేవునికెఱుక. కానీ, ఆ వ్యక్తి మాత్రం జ్ఞాపకం వున్నాడు. అతడు సుబ్రహ్మణ్యుడట! నా పేరూ సుబ్రహ్మణ్యమే. స్వాములవారి పూర్వాశ్రమం పేరు స్వామినాథుడు. 'స్వామీ గజముభానుజఃస్వామి యనగా సుబ్రహ్మణ్యుడే. ఎన్నో స్వాములు ఉండవచ్చు. అన్ని ఆ సాములలోను స్వామి స్వామినాథుడే - సుబ్రహ్మణ్యుడే!

ఎక్కడో దిండివనంలో స్వామినాథుడన్న పేరిటపుట్టి పదమూడవ ఏటనే - సన్యాసం తీసుకొని, కామకోటిపీఠాన్ని అధిష్ఠించి వున్న ఈ స్వామి విశిష్టత ఏమి? లోకంలో ఎందఱో మహానుభావులున్నారు. ఎందఱో మహానుభావులు అందఱికి వందనములు- అని త్యాగయ్య గారన్నారు. ఎదో ఒక్క నమస్కారం పెట్టి వెళ్ళక - ఈ స్వామినాథుని అందరూ కలకండ చుట్టూ మూగే చీమలవలె ఆశ్రయించుకొని, ఒక్క మారు చూచిన పిదప - మళ్ళా మళ్ళా- వారిని వదలకుండా- వారికి తొందర మనకూ తొందర - ఉండటానికి కారణమేమి? మిగతా వారికి లేని - వీరికి ఉన్న - నంది కేశ్వరునికి వలె కొమ్మలేవి?

కొమ్ములు లేకపోవటమే కొమ్ములుండటం అని నాకు అనిపిస్తుంది. మిగతావారి విషయం నాకు తెలియదు. ఈ సన్యాసిని చూడగానే-

''యో మే భర్తా స మే గురుః'' అన్న వాల్మీకోక్తి హృదయంలో అచ్చుగ్రుద్దినట్లై పోయింది. ఏ ముహూర్తంలో చూశానో తెలియదు. ఆ తర్వాత వేరే ఎక్కడావెళ్ళ బుద్ధి వేయలేదు.

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి!

ద్రావిడభాషలో నేను చదివినదంతా ఒకటోక్లాసు, అతిశయోక్తి కాదు. నాకు పదేళ్ళపుడు శ్రీ రంగంలోయాత్రకు వెళ్ళినపుడు మా నాయనగారు ప్రథమ వాచకం తీసి యివ్వగా ఆ పుస్తకం పదిరోజులలో పూర్తిచేసి పారవేశాను. దాని తర్వాత ద్రావిడభాషతో నాకు పరిచయం అస్తినాస్తి విచికిత్సయే! నాకంటే కొంచెం సుమారుగా నా భార్యకు అరవం తెలుసు. ఆవిడ స్వాములవారి ద్రావిడోపన్యాసాలను చదవటం, నేను విని వెంటనే తర్జుమా చేయటం - పత్రికలకు పంపడం - ఈ విధంగా నడచింది. తెలుగులోనూ జ్ఞానం అంత అంతనే. పోగా వేదాంతపరిభాష ఆరోజులలో నేను ఉన్న - దేశంలో కూడ లేదు. ఈ అసూరుణ్ణి తమ ప్రవచనా రచనా సారథ్యానికి స్వాములవారు ఎన్నుకొవటం - నేను చేయడం - ఇదంతా స్వాములవారి ా|n| ుౌ ఠషపుషస పరిహాసాభినివేశం- అనాలి.

నీలంరాజు వెంకట శేషయ్య గారికి స్వాములవారిపై ఎంత భక్తి అంటే... ఆ విషయం వ్రాయకుండా వుండటం ఉత్తమం. వారు సంపాదకులు. ఎంతోమంది రచయితలను ప్రోత్సహించినవారు. ఆ రచయితల రచనా వైదగ్ధ్య పటిమను త్రాసులో తూచినట్లు తూచగల స్వర్ణ కారులు. నా భాషను కొంత మెరుగు పెట్టి వుండే ఆయన సొమ్మేమీ పోయివుండేది కాదు. కాని ఆయన నా భాషను వేలువేసికూడా తాకలేదు.

నీలంరాజువారు వేలువేసికూడా తాకని నా భాషను బులుసువారు ఏమిచేయటమా తోచక- వేలూరి వారికి అప్పగించారు. దానితో వేలూరి వారికి శిరోవేదన ప్రారంభ##మైనది. నా భాషచదువుతూ వుంటే, ఆ మహానుభావుడికి అడగడుక్కూ సందేహమే! సందేహ నివారణకు నన్ను సలహాలు అడిగేవారు ! వారు వ్రాసిన ఉత్తరాలు నావద్ద ఎన్నో వున్నాయి. అని ప్రేమతో, పాండిత్యంతో, వారి అసాధారణ పరిహాసంతో, విద్యాదర్పంతో జ్ఞానభారంతో విషయవిస్తారంతో నిండి వున్నవి.

ఒక ఉత్తరంలో- 'అయ్యా కటక వాక్యములంటే ఏమి?' అని నన్ను ప్రశ్నించారు. 'నేను ద్రావిడంలో వున్నది వున్నట్లు వ్రాశాను. కటక వాక్యము లంటే నేనేమి చెప్పగలను? అన్నాను. 'స్వాములవారిని అడిగి తెలుసుకోరాదా?' అని ఇంకొక జాబులో, స్వాములవారు ఎక్కడో దూరంగా వున్నారు. నేను వెళ్ళనూలేను. వెళ్ళినా వారిని అడగడానికి అవకాశమూ వుండదు.' అని నా జవాబు.... ''మరి మీరు స్వాములవారిని కనుక్కోమంటే తిన్నగా కనుక్కొని వ్రాయరాయె. అసలు ఆసామీ ఆసరా లేకపోతే ఆ ఆసామీ చెప్పి దానిని ఎలా ఇంకొకరికి చెప్పటం? గీతోపదేశం అనే వ్యాసంలో కటకవాక్యాల మాట కనుక్కోమంటే కనుక్కోలేదాయె ఆమాట అరవనోటిమాట. అవి కటకవాక్యాలు కావు. ఘటక వాక్యాలు అని అంటారు వాటిని' అని వారి చరమసందేశం!

ఈ జగద్గురు బోధలు ఈ విధంగా వ్రాయబడి పది పుస్తకాలుగా వచ్చిందంటే మూకం కరోతి వాచాలం-అనపనిలేదా?

అంతటితో పోలేదు. శతావధానాలు చేసిన వేలూరి వారికి ఇంకా వేలకొలది సందేహాలు రావటానికి ప్రారంభ##మైనవి. నేరు గాణాపత్యం అన్న పదప్రయోగం చేశాను. ఈ పదం వేలూరి వారికి కొరుకుడు పడలేదు. వేలూరి వారనే వ్యాకరణమార్జాలమునకు- నేనొక ఎలుకపిల్ల నయ్యాను. వారి ఉత్తరం.

'శర్మగారూ!

పండితరాయలు- విద్వాంసో వసుధాతలే పరవచః శ్లాఘాసు వాచం యమాః' అని అన్నాడు. సరే, మీరు గొప్పంటే మీరు గొప్ప అని ఇస్తే వాయనం పుచ్చుకొంటే వాయనంగా సరిపెట్టుకొని వ్రాస్తున్నాను. ఈ పేజీ వెనుక 'గాణాపత్య' విషయంలో నాకు వచ్చీరాని వ్యాకరణం మూల మూలలది వచ్చిపడింది. అవసరమనితోస్తే మీరు స్వాములవారికి పంపి కనుగొనవచ్చును. నేను ఇది పూర్వపక్షంగా ప్రకటించలేదు. మరి పాఠకులకు, నాబోటి పాఠకులకు తిన్నంగా తెలియుటకు వ్రాసితిని.



గాణాపత్య

'గాణాపత్యము వడసెను బాణుండు' అని నాచనసోముండు- పాండురంగ మాహాత్య్యములో ఒక సీసమున, తెనాలి రామలింగడును- గాణాపత్య అని వాడిరి. శబ్దరత్నాకరమున గాణాపత్యము- ఒక మతము అని కలదు. ఇవన్నియు దుష్టప్రయోగములు.

'కితిచ' అను మాత్రమున భట్టోజీదీక్షితుల వారు- 'గాణాపత్యోమన్తృ', ఇతి తుప్రామాదిక మేవ' అని వ్రాయుట హరదత్తావరోధముచే గాని గాణపత్యమ్‌ అను శబ్దముసాధువే. చాతుర్వర్ణాన్‌గాణ మాకృతిగణము కాన 'ష్యఞ్య్‌' చేసిన సిద్ధించునని దీక్షితాశయము. కాని నపుంసకతాపత్తి స్వరభేదములు కలుగునని హరదత్తాశయ మని శబ్దరత్నాకారుని వివరణము. కాని హరదత్తుడు దీని వ్రాయలేదు.

''గణపతి శబ్ద స్యాత్ర పాఠాత్‌ గాణాసత్యో మన్త్ర ఇత్యపశబ్దః ఏతేన క్షేత్రపత్యం వ్యాఖ్యాతమ్‌. క్షేత్రపత్యం చరుం నిర్వపే దితి తు ఛాందసం. క్షేత్రపత్యం ప్రాశ్నన్తీతి ఛందోవ దృషయః కుర్వన్తి'' ఇతీ పదమంజరీ.

''శ్రీ మాధవాచార్యులవారి ధాతువృత్తిలో గృహపతేః భావః కర్మ వాగార్హపత్యమ్‌-పత్యన్త పురోహితాదిభ్యో యక్‌ ఇతి యక్‌. అధిపతి గణపత్యోన్తు బ్రాహ్మణాది త్వాత్‌ ష్యఞ్య్‌ - అధిపత్యమే. గాణపత్యమ్‌ యక్‌ షఞోః స్వరే విశేషః''

జైమిని చెప్పిన వేదపాదస్తవమున గాణాపత్య కలదని ఒక రనిరి. అది ఉదాత్తస్వర మయి గాని వేఱు హేతువుచే గాని (ఛాందస) అటులు ఉండనగును''.

మరుసటిదినమే వ్రాసిన జాబులో;

నిన్నటి లేఖలో గాణాపత్య శబ్దవిచారం చాలావుంది. అసలు శ్రీస్వాములవారి ద్రవిడపాఠమునందు ఎట్లున్నది? వారు గాణాపత్య అని పలికియుండరు. అయితే వాడుకలో ఆ పదం అలా అపభ్రంశం ఐతే కావచ్చును. అసలు గణ్శ పతి వస్తే అది వృద్ధి వచ్చి గాణ అగును గాని గాణా కాదు. పతి పత్య యగును. ఇంతే

మీకు ఆధారములు చూసితిని (గాణాపత్యము)శంకరుల పేర ఇంకొకటి మాఠాపత్యము కలదుగాని అపాణినీయములు అసలిది అరవపు ప్రతిలో కలదా లేదా? ఇదొక పెద్ద విషయముకాదు. వైయాకరణులకు తమాషాగా వుండును. వైయాకరణులు మాధవాచార్యుల వారిని కూడా శబ్దవిషయమున ఖండించిరి. అసలు 'అపాణీనీయ మనుట' భాష్యకారుని అనగా పతంజలి ఐషపుషస లో ్స మీకు ఈ పదము ఒప్పేమోకాని పాణిని చెప్పనిది. అని అనగా ఏసశపపుష-శ కాదు అని పరిహాసము. అస్తు... కొన్ని వ్యాసములను పూర్తిగా మార్చిన యెడల బాగుండునని తోచెనుగాని అది 'అశర్మణ్యము' అగు గదా! అటులు చేయదగినవి (విక్షయ గౌరవమునుబట్టి) నున్నవి.

ఉదాః- అంబికాతత్త్వము. ఉమాదేవి, శివుడవో ఇత్యాదులు ఎక్కడకు మితి? కానిండు. ఇది ఒnౌస|షా శి.రా.శా. వేలూరివారు వాద చుంచువు అనడానికి పై లేఖ దృష్టాంతం. ఇక వారి హాస్యం...

''మా బందుగుల్లో భగవచ్ఛాస్త్రుల్లు గారని ఒక అంతర్ముఖుడని పాండిత్యంలోని విశ్వతోముఖుడూ ఉండేవాడట. చల్లపల్లి రాజాగారు. బ్రాహ్మణుని ఇంట్లో భోజనం చేయడంపుణ్యం అని అనుకొని బహుశా గోవింద ద్వాదశికి సదరహీ భగవచ్ఛాస్త్రిగారింటికి భోజనానికి వెళ్ళారట ! పని చెప్పకుండా రాజుకు బ్రాహ్మడు తిండి పెట్టగూడదని ఎక్కడో ధర్మశాస్త్రం ఉందట. బాబూ పైకి అంటే తగాదా. కళగం వారు తగలబెడతారు! అపుడు అ.భ.శాస్త్రిగారు రాజాగారు విందుకుడిచే వసారాలో ఒక దణ్ణంకట్టి దానిమీద ఒక కొల్లాయ ఆరగట్టి దాని క్రింద పీటవేసి అన్నాదిశం వడ్డించి వారిని అచటికి తీసుకొనిపోయి ''కూచోండి... ఆహాహా కొల్లాయి ఉన్నట్టుంది. దానిని కొంచెం ఆవలికి తొలగించి కూచోండి. అని అన్నారట. ఆయన అలానే తొలగించి భోజనంచేసి పుణ్యం సంపాదించుకొన్నాడట!''

ఇంకో జాబు- వారి ఆరోగ్యం గూర్చి

''నాకు ఆయాసానికి తోడు బ్లడ్‌ ప్రెషరు సంభవించినదని వ్రాసే వుంటాను. శతావధానం అవలీలగా చేయగలిగి నాకు ఇంత మఱపు ఎట్లా వచ్చిందో! దాని ప్రభావం కదా! పైగా తూలుడొకటి, తలతిరుగుడు, గుండెలు ప్రాణాయామ ఎంతో కాలంనుండి అనుభవించినవి. అవి ఇపుడు నా మాట వినకుండాపోయినవి. 'య మే వైష వృణుతే తేన లభ్యః అన్నమాట నాకు అపుడపుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతా అమ్మదయ ! మనం ఎంతచేశామని అనుకొంటే ఏమి లాభం అమ్మకు దయరావాల.

వాడంటాడు-ఎంతో బాగా అంటాడు

న యాహి చేత స్త్వమిత స్తతో2పి

దేహేంద్రియాద్యైర్న కురుష్వ కర్మ |

త్వం యత్ర కుత్రా వ్యుపవిశ్య నిత్యం

విచారయస్వ స్వనిదాన మంతః ||

ఓ మనసా! నీవు అటూ ఇటూపోకు. దేహేంద్రియాదులతో (కలసి) పనిచేయకు! ఎక్కడో అక్కడ కూచుని ఎప్పడూ నీ మూల మెక్కడో లోపల వెతుకు!

పరిచయవాక్యాలు అవసరమని తోస్తే వ్రాస్తాను, లేకుంటే లేదు. శ్రీ స్వామివారికి- నా చతుస్సాగపర్యంతం గోబ్రాహ్మణభ్య శ్శుభం భవతు, వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్ర్యారేయ కౌండిన్యసగోత్రః యజుశ్శాఖాధ్యాయీ ఆపస్తంబసూత్రః- శివరామశర్మా2హంభో అభివాదయే- అని నా సాష్టాంగాభివాదనములు మనవిచేయ గోరినాను. (ష.రా. నేను ఒక్కరోజూ ఈ విషయం స్వాములవారికి ఎరిగించ లేదు. అంతా మానసికమే- పైగా సన్యాసులకు వందనం చేసేటపుడు ప్రవర చెప్పరాదని శాస్త్రమున్నదట! విశాఖ). అనగా నేను శతావధాని అని కాని, వైయాకరణుడనికాని, ఉప్పులేక ముప్పుందుము తాగుతా నని కాని చెప్పవలదు. ఇవన్నీ సంసారుల డాబులు. సభలో కొట్టుకొన్నాంలెండి.

ఉ|| గంటలు గట్టికొంటివట గంటకు వందలు వేలు

పద్దెముల్‌ గెంట్లుదు నంచు నేడు పరికించెద గెంటుట....

...... నీ -ఘంటిక లూడగొట్టెదను గాచుకొనన్‌ గమనింపు

మిత్తఱిన్‌- ఇత్యాది నవ్వు వస్తూంది వ్రాస్తూంటే.

ఎంత సంసారం ఎంత సంసారం! విద్యాసంసారం సంసారం కంటే అరణ్యం! అర ్శ ణ్యమ్‌- కాదు. (చూ.ఛాందోగ్యం) చూచారా! ఈ షుషశషుn మళ్ళా ఎంత సంసారమో!

శరీరంలో ఏమీ ఆరోగ్యం లేనిమాటలు ఈ ఉత్తరంలో ధ్వనిస్తున్నవని అనుకొంటాను. రెన్నాళ్ళనుండి ఒకటే పని పెట్టుకొని అనారోగ్యాన్ని ఓసరిల్ల చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు.

''ఇక మీ తెలిగింపు విషయం, ఎక్కడనో ఒక చోటున కొంచెం ద్రావిడాన్ని ముద్దు పెట్టుకొంటుందని అనుకొన్నారే అది ిసశnశెషుస అందరకూ తప్పదు. ఆ ద్రావిడ ప్రాణాయామం. నేను ఆంగ్లంనుంచి కొంత, గుజరాతీ నుంచి కొంత ఆత్మకథ (గాంధీగారిది), బాంగ్లా నుంచి టాగోరు, శరత్‌ వగైరాలు తర్జుమా చేశాను. ఆదిలోలాగే అనుకొన్నాను ఏ భాషలోంచి మనము తెలిగిస్తామో ఆ భాషలో ాాసషశ న్నూ (కారక) కొత్తరూపకాలున్నూ (ః|-షుూఠుస) తెలుగులోరూపుమాపి దిగుబడుతవి. అది సహజం. ూఠ| షఠ| సశ-| ుnగ; షఠ| శెnగషశగ| శు పషష శి| ుnగ షు గస|ూ షఠ| ాూసష శష శెసగ|. అస్తు.

పరమహంసకు ః. అనగా ః|ఠ|ndస| కశషఠ ఏ. ఎట్లో శ్రీ కామకోటికి విశాఖ అనగా శర్మగారు అట్లు. ఇది నా పరమ-పరమ- అభిప్రాయంఊ, తొందరగా సర్దుబాటు చేసి పంపండి.''

''రెండవ వాల్యూంలో 60 శ్లోకాలుదాకా అర్థాలు వ్రాశాను. అవన్నీ మాండూక్య కాఠికలే కావచ్చు. ఆ ఎత్తు లోంచి బుద్ది క్రిందికి దిగటం లేదు. మేలి సంస్కృత పదానికి మేలి తెలుగుపదమే పడుతూంది. వాడుకలో పదానికి ఇంపు కలగటంలేదు. మరి మీ ఆరువ్యాసాలను వాడుకభాషలోకి మార్చాను. ఈలాటి పనిలో ఈ సరస్వతీ-దుర్గా-మహానవమీ-దసరాపూజల మూలంలోకి పోయి ఋక్కులూ, జ్యోతిషమూ (జోస్యంకాదు)పురాణాలూ దేశాచారాలూ, వీని అన్నింటికీ కల ఐక్యం అన్వేషించాను. ఇక దాన్ని ఈ ా|శుn లో ఈుససషాశష| చేయాలి. ా|శుn దాటిపోతే పుటపాకంలోకి రాదు ఇక మీకు ూ||ీ |nd లెటరే. మీరు సోమరిగా కూచుని రాయరేం? నన్ను స్తుతిచేయడం పెట్టుకోకండి. లోగడిది చాలు...''

శాస్త్రిగారి ఆరోగ్యం శిధిలమౌతూనే వుండినది. వారి నిర్వేదం ఒక ఉత్తరంలో ఇలా వ్రాశాను.

''ఆశీః మీ చీటీ చూచాను. ఉత్తరం వ్రాయాలనే ఉత్సాహం కూడా చప్పబడిపోయింది. లోపలి వెలుగులో ప్రసారశక్తి తఱుగుతూ వస్తూందని దానికి బదులు సంకోచ శక్తి వృద్ధి అవుతూ వుందని ఊహించ నక్కరలేదు; అనుభవమే అవుతూవుంది. ¸°వనమునుండి వార్ధకం వఱకు నియతంగా మనోనియమాదికం అభ్యసించకపోతే వచ్చే ఆపదే యిది. మా నాయనగారు వేదమంతా చెప్పుకొన్న కర్మిష్ఠి. తగుపాటి శాస్త్రవాసన ఉండేది. వారునన్ను చూచి అనేవారు 'కావలసింది వేఱ వుంది. కావలసింది వేఱ వుంది.'అని వారు చెడ్డ ఉపాసకులుకూడా. నేను జ్ఞానపక్షపాతినే కాక భక్తినీ జనాన్నీ ఈసడించేవాడను. వారు చాలా నొచ్చుకొనేవారు. నన్ను ఒప్పింపలేక పెద్ద పెద్ద పండితులు వచ్చినపుడు వారిని నా మీదకు తోలేవారు. వారు అనేవారు- మాకే ఆయన చెపుతారు. ఆయనకు మేము చెప్పేదేమిటి? అని. ఇలా చాలాకాలం కడచింది. నేను తోటకొని సాధనలో పడ్డాను. ఒకనాడు హఠాత్తుగా వార్తవచ్చింది. పదిగంట లప్పుడు ''నాయనగారు సంధ్యావందనంచేసికొని పీటమీద కూర్చుండి కొంచెము సేపటికి ఒఱిగిపోయినారని'' అదృష్టమంటే అది. ఇపుడు నాకు మనసు చెదరి పోతుంది. లక్ష్యంలో అనగా నేనులో నిలువదు. అనేక జన్మల పంకంలో తిరుగుతుంది. దారి ఎదురుగా కనబడ్డా తోవ తప్పుతుంది.

శాస్త్రాణ్యధీత్యాపి భవన్తి మూర్ఖా

యస్తు క్రియావాన్‌ పురుష స్స ఏవ |

సుచింతితం చౌషధ మాతూరాణాం

న నామమాత్రేణ కరో త్యరోగమ్‌ ||

చదువులు చదివినా మూర్ఖులు అవుతారు. పని చేసినవాడే పురుషుడు. ఫలానామందు ఈ రోగం కుదురుస్తుంది. అని తెలిసి మందు పేరు చెప్పినంత మాత్రాన రోగం కుదరదు.

ఉపనిషత్తు కూడా ఇలా చెపుతూంది-

ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి

విజానన్‌ విద్వాన్‌ భవతే నాతివాదీ-

ఆత్మక్రీడ, ఆత్మరతిః క్రియావాన్‌-

ఏష బ్రహ్మవిదాం విరిష్ఠః |

ఆత్మక్రీడః అనగా ధ్యాతృ ధ్యేయ ధ్యాన త్రిపుటిలో సవికల్ప సమాధి అను క్రియను ఆచరించుట (క్రియావాన్‌) అనేదిన్నీ ఆత్మరతిః అనగా త్రిపుటిలేని నిర్వికల్పసమాధి అనిన్నీ అందు ఆనందానుభవము. (క్రియావాన్‌) అనేదిన్ని అని పెద్దలు చెప్పారు. జ్ఞానికి శ్రాత స్మార్త కర్మలు లేవు. అతడు ఆత్మక్రీడుడు-ఆత్మరతుడు. కావున క్రియావాన్‌ అనగా ధ్యానాదులు అని విన్నాను. ఎందులకు నా యీ గొడవ వ్రాశానంటే మీకు కూడా నలభై రాబోతున్నవి. (23-9-65)నేను నలభైకి 10-12 తక్కువగా ఉండగానే సాధన ఆరంభించిన్నీ తదేకపరత్వం లేక పోవడాన సిద్ధుడను కాలేకపోయినాను. ఆఖరుకి మరణవేళలో మనస్సు దుర్బలమైపోదగిన దుఃస్థితిలో ఉన్నాను. బాబూ! మీరు జీవికకు చేసే వృత్తిపోను మిగిలిన కాలమంతా తత్త్వజిజ్ఞాసకు వినియోగం చేయండి అని ప్రార్థిస్తున్నాను. చేస్తూనే ఉన్నారు; ఐనా నా పోటునుబట్టి చెప్పేమాట.

ఘటికా స్థానాల గూర్చి వ్రాసిన ఒక వ్యాసం భవన్స్‌ జర్నలులో (ఇలస్ట్రేటడ్‌ వీక్లీలో ఇది ప్రచురింపబడ్డది విశాఖ చదివిన గుఱుతు.

శ్రీ శేషేంద్రశర్మగారు వ్రాసింది చూస్తూ ఉన్నాను. ఈ కుండలినీయోగ వ్యంగ్యంమాట పెద్దలు చెప్పుతూవస్తున్నదే. ఈ సూచనను నేను గోవిందరామాయణ పీఠికలో సూచించారు. శ్రీ శేషేంద్రశర్మగారు d|షశ లో ప్రతిదీ గ్రంథకర్తకు అభిప్రేతం కాకపోవచ్చు.

మీ ట్రాంబేమీదికి బాంబులు దూకుతాయేమో అని ఒకనాడు ప్రాణం కొట్టుకొన్నది. కానీండి ఈ ఈ||| ౌ ఏమవుతుందో చూద్దాం. వే. శి. శా.

ఈ పండిత ప్రకాండుడు, విద్యాతపస్వి, సుహృదశీలుడు. ప్రేమపాత్రుడు. భగవద్గీతను వింటూ, కృష్ణానుస్మరణతో కళ్ళు మూసుకొన్నాడు. కామకోటి సరస్వతికి ఈ విద్యా సరస్వతి చేసిన సేవను ఈ కుసుమాంజలిలో జ్ఞప్తిచేస్తూ, స్వామి చరణ సన్నిధిలో వారికి ఉత్తమలోకప్రాప్తి కావలెనని విన్నవించుకొంటున్నాను.

వేలూరివారికి స్వాములవారి పాండిత్యప్రకరలో ప్రగాఢగౌరవ ముండేది. స్వాములవారి ఉపన్యాసాలపై పెద్దకారికలే వ్రాయవచ్చునని ఆయన అనేవారు. బహుశా వారి ఆరోగ్యం బాగా వుండి మరింతకాలం బ్రతికేవుంటే వారు ఏమి చేసి ఉండే వారో.

వేలూరివారితోడి లేఖారూపక సాహచర్యం- బోధల మూలంగా స్వాములవారు నాకు అనుగ్రహించిన పెన్నిధి. అట్టి వేలూరి వారికి, నా కృతజ్ఞతను ఎలా తెలుపగలను?

ఈ పదిభాగములలో కొన్ని ద్రావిడమాతృకకు అనువాదములు, కొన్ని ఆంగ్లమాతృకకు అనువాదములు. వీనిలో 5వ భాగమును అనువదించినది, కవివరేణ్యులలో గణన కెక్కినవారు- శ్రీ కాటూరి వేంకటేశ్వరరావుగారు, వారు స్వాములవారిపై నమోవాక షష్ట్యంత పంచకమును వ్రాశారు. ఆ పద్యాలు హృదయాన్ని ఊగింపచేసేటట్లు ఉంటవి. కానీ మా వేలూరి వైయాకరణులకు- ఒక పద్యంలో ఛందోభంగం కనపడక తప్పిందికాదు! వారు వెంటనే నాకొక ఉత్తరం వ్రాస్తూ- 'మా కాటూరు పద్యాలలో ఒకదానిలో యతిభంగమైంది. యతులపై వ్రాసిన పద్యంలోనే యతిపోతే ఎట్లా?' అని వాపోయారు! కాటూరి వారి నమోవాకము;

శ్రీమద్‌ భారత కాంచీ

దామాయిత కాంచినగరధామునకు నవి

ద్యామయహరణ సుధాకల

శ్రీమంజులదర్శనునకు సిద్ధపదునకున్‌

స్మయదూరునకున్‌ సతసం

శయ దళనున కనుపమాన శాంతినిధికి వి

స్మయకారి బోధమతి క

వ్యయపద వితరణ సమర్థ పాదాబ్జునకున్‌.

దూరీకృత నతచింతా

భారునకు ముముక్షు సేవ్య భవ్య మహావి

స్తారున కద్వయపద సం

చారణ శిక్షాపదాన సంవిన్మతికిన్‌

నతమస్తకతల సంయో

జిత కరతలమాత్ర ధూత చిరతాపునకున్‌

ప్రతివాది ముఖ పిధానా

ప్రతిమాద్వయ వాద వికచ వాగ్వల్లరికిన్‌.

పరమశమ నిరతునకు శం

కరదేశిక కామకోటికల్పిత పీఠ

స్థిర మంగళదీప శ్రీ

చరణునకున్‌ మాదృశ ప్రసన్నశివునకున్‌.

ఇందులో కొన్ని స్వాములవారు ఆంధ్రదేశంలో పర్యటించినపుడు స్వయముగా తెలుగులో అనుగ్రహించిన ఉపన్యాసములు. ప్రస్తుత భాగములో కొన్ని-దైవత్తిన్‌ కురల్‌- దైవవాణి అను ద్రావిడోపన్యాస సంకలనము నుండి అనూదితములు. ఈ పదిపుస్తకములలో దాదాపు శ్రీవారి ప్రవచనామృతము అంతయు ఆంధ్రలోకమునకు అందించడమైనది. ఇది పరమేశ్వరవాణి, పరమేశ్వరు డున్నాడో లేడో తెలియదు. కష్టంలో చిక్కుకొన్న గజేంద్రుడు 'కలడు కలం డనెడు వాడు కలడో లేదో'- అన్న విచికిత్సలో పడ్డాడుపాపం. కాని గురువు విషయం అట్లాకాదు. గురువును ప్రత్యక్షంగా చూస్తున్నాము. పరమేశ్వరుడు దిక్కులేనివాడు. మనం అట్లాకాదు. 'నీవు అనాథుడవు, నేను సనాథుడను'అని త్యాగయ్య గారంటారు. ఈ పదిపుస్తకాలలో స్వాములవారు ఏమి బోధించారోకొంత సింహావలోకనం చేద్దాం. కాని స్వాములవారి ఉపన్యాసాలన్నీ చర్వితచర్వణాలు. మొదటి పుస్తకంలో ఏం చెప్పారో అదే కడపటిపుస్తకంలోనూ చెప్పారు! ''యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః''-

''చితిరేవ మహాసత్తా సమ్రాజ్ఞీ పరమేశ్వరీ

త్రిపురా భాసతే యస్యా మభిన్నాం విభిన్నవత్‌,''

త్రిపురారహస్యం.

అమ్మ గొప్పనా? అయ్య గొప్పనా? తైత్తరీయం, మొదట 'మాతృదేవో భవ' - అని అన్నది. తర్వాత తండ్రి! 'పితృదేవో భవ' స్వాములవారు పరమ శాక్తులు. వారు తరచు బోధించేది అంబికా తత్త్వమే. ఒకపుడు నేను నా భార్యతో, తల్లితో వారి దర్శనార్థమై వెళ్ళాను. గురువందనం చేయబోగా నన్ను ఆపారు. నేను ప్రశ్నార్థకంగా చూడగా- 'మొదట మీరిద్దరూ తల్లికి నమస్కరించి పిదప నాకు నమస్కారం చేయండి' అన్నారు. శ్రీ వారి బోధలు, ప్రథమభాగంలో జగన్మాత- జగత్పితతో ప్రారంభ##మైనవి. కాళిదాసు రఘువంశ కావ్యం వ్రాశాడు. దానిలో మంగళ శ్లోకం.

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే |

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా ||

శబ్దార్థములవలె ఒకరి నొకరిని వదలక సంపృక్తంగా పార్వతీ పరమేశ్వరు లున్నారుట. శబ్దార్థములను సరిగా తెలుసుకోవడానికి కాళిదాసు వారిని నమస్కరిస్తున్నాడు. శబ్దం మనం సరిగా వినవచ్చు. కాని దాని అర్థం తెలియడమెట్లు? దానికి భగవదనుగ్రహం వుండాలి. 'ఆప్తోప దేశ వాక్యం శబ్ధః'- స్వాములవారు ఈ వ్యాసంలో ముత్తు స్వామి దీక్షితులవారిని స్మరించారు. ఆ మహానుభావుడు సుబ్రహ్మణ్యశ్వరుని - స్వామినాథుని- భక్తుడు. శ్రీ మీనాక్షీ మే ముదం దేహి - పాశమోచని- అని పాడుకొంటూనే తమ శ్వాసను అమ్మవారి పాదములకు అర్పించి ఐక్యమైపోయాడు. 'యం యం వాసి స్మరన్‌ భావం త్యజత్యంతే కళేబరం- తం తం మేవ' -' క్రతో స్మర, కృతం స్మర'.

శంకరభగవత్పాదుల అడుగుజాడలలో నడచే స్వాములవారిని అద్వైతులని ప్రత్యేకంగా చెప్ప పనిలేదు. స్వాముల వారికి సర్వమతములూ సమ్మతములే.

స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢమ్‌ |

పరస్పరం విరుధ్యన్తే తై రియం న విరుధ్యతే ||

ఇతర మతములకు అద్వైతమును చూస్తే కన్నెఱ్ఱగా వుంటుందేమో . అద్వైతానికి దేనిలోనూ నిరోధం కనబడదు. ఆ అద్వైతవాసన ఈశ్వరానుగ్రహం వుంటేకాని లభించదు, అద్వైతం అంటే 'సర్వతః సంప్లుతోదక స్థితి' అన్నమాట.

నల్లనయ్య అనే ఉపన్యాసంలో -మహావిష్ణువు- నీల మేఘశ్యామంగా వుండటమే కాక - నీల మేఘంగానే వున్నా రన్నారు. కారుణ్యాభ్యం త్రిదశపరిషత్‌ కాలమేఘం దదఠ్శ. నారాయణస్మరణ- ప్రాతఃకాలంలో చల్లని వేళ- చల్లని ప్రభువును స్వరూపధ్యానం చేయాలని బోధ.

కేనోపనిషత్తులోని ఉమ- హైమవతి అంటే స్వాముల వారికి విశేష పక్షపాతం- 'బహు శోభమానా ముమాం హైమవతీం' శంకరుల భాష్యంలోని - 'నిత్య మేవ సర్వజ్ఞే నేశ్వరేణ సహ వర్తతే' అన్న వాక్యాన్ని స్వాములవారు స్మరిస్తారు; స్మరింప జేస్తారు.

మీరాబాయి గిరిధరునకు స్వాత్మార్పణం చేసుకొన్న పరమ భక్తురాలు. ఆమె బృందావనానికి వెళ్ళింది. అపుడు వల్లభాచార్యులవారు ఆ చోట ఉన్నారు. మహాపురుషుడు కదా ఆయన దర్శనం చేద్దామని మీరాబాయి అనుజ్ఞకోసం వార్త పంపింది. ఆయన -నాకు 'స్త్రీని చూచే అలవాటు లేదు' అని బదులు పంపాడట. 'ఈ బృందావలంలో కృష్ణుడొక్కడే పురుషుడు. మిగతా జనమంతా స్త్రీలే అని అనుకొన్నాను. 'నేను పురుషుడను' అన్న భావం మీకు ఉంటే ఈ బృందావనంనుంచి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు, అని ఆమె బదులు పంపింది. అంతటితో వల్లభాచార్యులవారు కళ్లుతెరిచారు ! ఈ కథను స్వామి ఆనందతాండవమూర్తి అనే వ్యాసంలో చెప్పారు. ఆనంద తాండవమూర్తి, చిత్సభేశుడైన నటరాజు వారికథ చెప్పేటపుడు- 'కృష్ణానుస్మరణం పరం' అని మీరాబాయి కథ చెప్పుకొని వస్తున్నారు స్వాములవారు

ఈశ్వర మూర్తులు ఎన్నో వున్నాయి. నటరాజు ఆనందతాండవమూర్తి

అనంత నవరత్న విలస త్కటక కింకిణి

ఝలంఝల ఝలంజల రవమ్‌

ముకుంద విథి హస్తగత మర్దఱ లయధ్వని

థిమిద్ధిమిత నర్తనపదమ్‌,

శకుంతరదబర్హి రధ నందిముఖ దంతిముఖ

భృంగి రిటి సంఘనికటమ్‌

సనంద సనక ప్రముఖ వందిత పదం

పర చిదంబరనటం హృది భజ.

ఆయన నర్తన మాడుతుంటే బ్రహ్మ విష్ణువు మద్దెలలు వాయిస్తున్నారట. దాక్షాయణి దక్షుని యజ్ఞానికి వెళ్ళవలెనని పట్టు పట్టుతుంది. అల్లుడు ఈశ్వరుడు వద్దంటాడు. ఆమె ఆయన మాట వినకుండా వెళ్లుతుంది. దక్షుడు చేసిన ఈశ్వరనింద భరించలేక ఆమె యోగాగ్నిలో దగ్ధమౌతుంది. ఈశ్వరునికి కోపం వస్తుంది. ఒక జటను పెఱికి నేల మీద కొట్టగా వీరభద్రుడు అవతరిస్తాడు.

'గచ్ఛ గచ్ఛ మహాబాహో దక్షయజ్ఞం వినాశయ'- అని ఆన పెట్టుతాడు. అదొక ఈశ్వరావతారం. పొగా కాల భైరవు డున్నాడు.

సీ|| చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు

విమల దంష్ట్రా ప్రరోహముల వాని

పవడంపు గొనలతో ప్రతివచ్చు ననవచ్చు

కుటిల కోమల జటా చ్ఛటల వాని

ఇంద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు

కమనీయతర దేహ కాంతి వాని

ఉడురాజ రుచులతో నొఱవచ్చు ననవచ్చు

చంచ న్మదాట్టహాసముల వాని

సిగ్గుమాలిన మొలవాని బిఱుతవాని

నెల్ల కాలంబు ములికానా డేలువాని.

........ ........ ....... ....... ...

అని శ్రీనాథుడు వర్ణించిన కాలభైరవుడు వేరే వున్నాడు. పోగా, దారుకావనములో ఋషి పత్నులను మోహవారిథిలో మునకలు వేయించిన భిక్షాటన మూర్తి ఋషుల అభిచార ప్రయోగము లన్నింటినీ ఎదుర్కొని తర్వాత ఏదో తపస్సు చేసుకోకుండా ఈ బాధ అంతా మన కెందుకు? అనుకొని- అక్షీణ దయానిధానమైన ఆచార్య స్వరూపంతో, దక్షిణామూర్తియై వటవృక్షము క్రింద చిన్ముద్రతో కూచున్నాడు. 'అపార కారుణ్య సుధాతరంగై రపాంగపాతై రవలోకయంతం'- అట్టి దక్షిణామూర్తి అంటే స్వాములవారికి అతీవప్రియం. 'దీక్షితం జడధియామనుగ్రహే- దక్షిణాభిముఖ మేవ దైవతం' తామే తమ భక్తకోటికి - ఆశ్చర్య గుణాధివాసుడైన ఆచార్య దక్షిణామూర్తి వలె కనిపిస్తున్నారని స్వాములవారు ఎఱుగరు! వారి అజ్ఞానానికి మన మేమి చేయగలం !!

స్వాములవారికి ఎవరో ఒకరు ఒక స్ఫటికమాల నిచ్చాను. దానిలో ఒక పగడం మేరువుగా కట్టి వున్నది. దానిని చూడగానే స్వాములవారు ఇది అక్షమాల అని గ్రహించారు. పిట్టకథలు చెప్పేదానిలో స్వాములవారికి వారే ఈడు. వెంటనే ఆయన మనస్సు మాఘకావ్యం పైకిపోయింది.

నారదుడు ఆకాశమార్గంలో వస్తున్నాడట. ఆయనను మాఘుడు ఇలా వర్ణించాడు.

అజస్ర మాస్ఫాలిత పల్లకీ గుణ

క్షతోజ్జ్వలాంగుష్ఠ నఖాంశు భిన్నయా |

పురః ప్రవాళై రివ పూరితార్థయా

విభాంత మచ్ఛ స్ఫటికాక్ష మాలయా ||

మాలను తిప్పడములో -ఎప్పుడూ వీణను వాయించుట వల్ల ఎఱ్ఱబారిన ఆయన బొటనవ్రేలి ఎఱ్ఱదనము, స్ఫటికమాల యందలి స్ఫటికములను, ఎఱ్ఱగా ప్రవాళములుగా మార్చి వేసినదని కవి చమత్కరిస్తున్నాడు. స్వాములవారు అన్నారు. ''నే నేమి నారదుడినా? స్ఫటికమాలను ప్రవాళముగా మార్చేటందుకు? అందుచేతనే ఈ మాలలో వాస్తవంగానే ప్రవాళాన్ని మేరువుగా ఎన్నుకొన్నారు!'' అని

శివుడవో మాధవుడవో అన్న వ్యాసంలో -దేవతలకు సమాన విషయంగావచ్చిన సందేహానికి సమాధానం స్వాములవారు పరిష్కరిస్తారు. 'తామేశ్వరం' అన్నది ఏ సమాసం? కర్మధారయమా, తత్పురుషమా, బహువ్రీహియా? విష్ణువు 'రామేశ్వరము' తత్పురుష సమాస మని అన్నాడట. మహేశ్వరుడు 'బహువ్రీహి'అని అన్నాడట. శివ విష్ణువులకు పరస్పరం భేదాభిప్రాయం ఏర్పడేసరికి - అదీకాదు, ఇదీకాదు- ఇది కర్మధారయ మని బ్రహ్మగారు తీర్పు చెప్పాడట!

భక్తి విషయంగా చెప్పుతూ శివానందలహరిలోని 'అంకోలం నిజబీజ సంతతి' అన్న శ్లోకాన్ని స్వాములవారు ఉదాహరించారు. భక్తి అనగా - ''పశుపతేః పాదారవింద ద్వయం, చేతోవృత్తి రుపేత్య తిష్ఠతి సదా సా భక్తి రిత్యుచ్యతే'' దీనితో పాటు సదాశివ బ్రహ్మేంద్రులవారి శ్లోకమూ స్వాములవారు- ఉదాహరించారు.

యాచే నాభినవం తే

చంద్రకలోత్తంస కించి దపి వస్తు|

మహ్యం దేహి చ భగవన్‌

మదీయ మేవ స్వరూప మానందమ్‌||

సదాశివ బ్రహ్మేంద్రులు - నిన్ను నేను క్రొత్తగా ఏదీ యాచించటంలేదు. నా స్వరూపమే నాకు ఈ - నా స్వరూపమే ఆనందం. దాన్నే నాకే - అని అంటారు.

శివవిష్ణువుల అభేదమును స్వాములవారు తఱచూ చెబుతుంటారు. ఆ విషయంగా కాళిదాసును షుష| చేస్తుంటారు.

ఏకైవ మూర్తి ర్బి భిధే త్రిధా సా

సామాన్య మేషాం ప్రథమావరత్వమ్‌ |

విష్ణో ర్హర స్తస్య హరిః కదాచిత్‌

వేధా స్తయో స్తావపి ధాతు రాద్యౌ ||

ఒకేమూర్తి ముత్తెరుగులుగా వేరాయెను. వీరిలో ఒకరు పరుడైనచో, ఇతరులు అపరులు అగుదురు. ఎక్కువ తక్కువ మాటలు లేవు. పోగా శ్రీకృష్ణభగవానుల అభయవాక్య ముండనే వున్నది.

యో యో యాం యాం తనుం భక్తః

శ్రద్ధయార్చితు మిచ్ఛతీ|

తస్య తస్యాచలాం శ్రద్ధాం

తామేవ విదధా మ్యహమ్‌ ||

భక్తుడు శ్రద్ధతో ఏయే రూపమును అర్చించుటకు ఇష్టపడుతున్నాడో, ఆ రూపములో అతని శ్రద్ధను అచలంగా వుండేటట్లు అనుగ్రహిస్తాను - అని అంటున్నాడు. భగవంతుడు మనవలె తెలివిలేక, శక్తిలేక ఉండే ఆసామికాదు. 'కర్తుం అకర్తుం అన్యధా కర్తుం'- అని పలువిధములైన శక్తులు గలవాడు భగవంతుడు. అనేక రూపములున్న అ రూపి.

అగ్ని ర్యథైకో భవనం ప్రవిష్టో

రూపం రూపం ప్రతిరూపో బభూవ |

ఏక స్తథా సర్వభూతాంతరాత్మా

రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ ||

వాయు ర్యథైకోభువనం ప్రవిష్టో

రూపం రూపం ప్రతిరూపో బభూవ|

ఏక స్తథా సర్వభూతాంతరాత్మా

రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ ||

ఏకో వశీ సర్వభూతాంతరాత్మా

ఏకం రూపం బహుధా యః కరోతి ||

త మాత్మస్థం యే2నుపశ్యన్తి ధీరా

స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్‌ ||

అగ్ని ప్రపంచమున ప్రవేశించి తాను దహించే వివిధ వస్తువుల ఆకారముల కనుగుణమైన రూపమును ధరిస్తున్నది. అదే విధంగా ఆత్మకూడ తాను ప్రవేశించే భిన్నవస్తువుల కనుగుణంగా భిన్నా భిన్న ఆకారములతో భాసిస్తూ, వానికి అతిరిక్తముగానున్నది. వాయువూ ఇట్లే. సర్వమును తన వశమందుంచుకొని సకల ప్రాణులకు అంతరాత్మయైన ఆత్మ ఏకైక రూపమును బహవిధముల భాసింపచేస్తున్నది. తమ ఆత్మలోనున్న ఈ తత్త్వమును దర్శించే జ్ఞానులకు మాత్రమే శాశ్వతసుఖము. ఇతరులకుకాదు, అని కఠోపనిషత్తు బోధిస్తున్నది. అందుచేతనే శంకరులవారు - ''సచభగవాన్‌జ్ఞానైశ్వర్యశక్తి బలవీర్య తేజోభిః సదాసంపన్న''- అని భగవంతు నిషడ్గుణౖశ్వర సంపన్నునిగా వర్ణించారు.

'తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్‌' ఆ శాశ్వతమైన సుఖమెవ్వరికి? ఆ శాంతినిలయమును, శాంతిధామమును, పరంపదమును ఏమంటారు? అదే ముక్తి. ఆ ముక్తి మనకు రావలెనంటే భక్తి దానికి ప్రధానమార్గమని స్వాములవారు సెలవిస్తారు. ముక్తి అంటే పారలౌకికంకాదు. ఆత్మానుభవమే అభేదానందమే. అద్వైతమే. 'అద్వైతమేవ సత్యం' అద్వైతమేవ సత్యం. అద్వైతమేవ సత్యం' అని ముమ్మారులు భగవత్పాదాచార్యులవారికి - ఈశ్వరుడు మధ్యార్జునక్షేత్రంలో అనుగ్రహించాడు.

పరమ జ్ఞానులూ, విరాగులూ, అద్వైతానుభవము నందినవారూ, అట్లే సమాధిలో కూర్చోక- ఆ నిరాకార పరబ్రహ్మ ఆకారాన్ని చూడాలని ఆకాంక్షిస్తూ భక్తి చేస్తారట;

ఆత్మారామశ్చ మునయః నిర్గ్రంధా అప్యురుక్రమే |

కుర్వన్త్య హైతుకీం భక్తిం ఇత్థం భూతగుణోహరిః ||

మునులకు మనవలె గ్రంథులు- ముడులు-ఏవీ లేవు. వాళ్లు ఎప్పడూ ఆత్మారాములు, కోరికలు వారికి అసలేలేవు. కాని ఒక్కకోరిక మాత్రం వాళ్ళకు పాపం మిగిలిపోయింది ! హరియందు ఆ హైతుభక్తి వుండాలని !! హరియొక్క మోహనగుణం అటువంటి దన్నమాట !

దైత్వ, విశిష్టాద్వైత, అద్వైత మతము లన్నీ భక్తి ప్రాధాన్యమును అంగీకరిస్తవి. భగవంతుడు జ్ఞానానందైశ్వర్య సంపన్నుడు. 'సముద్ర మివ గంభీరం' సముద్ర మివ నిశ్చలం మనకు నిశ్చలత, గంభీరత రావాలంటే ఆ సామి వద్దకు వెళ్ళితే కాని ప్రయోజనము లేదు. 'ఇదం సర్వం పురుష ఏవ' అని శ్రుతులంటున్నవి. శంకరులు దీనిని యుక్తి చేత, అనుభవముచేత - సాధించవలె నని బోధిస్తున్నారు.

స్వాములవారు అంటూ వుంటారు. మనకు కావలసిన దల్లా హృదయం ద్రవించే భక్తి. ఏదో మూటకట్టుకొని ఈ లోకానికివచ్చాం. పాపమూ వద్దు, పుణ్యమూ వద్దు ఈ మూటను ఇక్కడే దులుపుకొని వెళ్ళిపోవాలి. అందులకు ఆ పరమేశ్వరి, లోకమాత, దారినిచూపే త్రిపురసుందరి- అనుగ్రహం వుండాలి. స్వాములవారు కథలు చెప్పేదాంట్లో కుశలులు, ఉదాహరణంగా వీరప్పస్వామి కథ చెప్పారు.

సుమారు యాభై డెభ్భై ఏళ్ళక్రితం చెట్టినాడులో వీరప్పస్వామి అనే ఆయన వుండేవాడు. భక్తుడు చిత్తశుద్ధి కలవాడు. కాని చంద్రుని లోని మచ్చవలె ఒక్కటే దుర్గుణం. ఆయన లోపం- ముక్కుపైన కోపం, ఈయనకు సుబ్బరామయ్యరు అనే బ్రాహ్మణుడు స్నేహితుడు. 'అయ్యా! నా కోపం పోవడానికి ఏదైనా మార్గమున్నదా?' అని ఆయన అడిగాడు. అయ్యరు, తిరుక్కోయీలూరుకు వెళ్లు - దారి కనపడుతుంది. అని అన్నాడట. ఆయన వెంటనే తిరుక్కోయిలూరు వెళ్ళారు. దక్షత కలవాడు. ఏ కార్యం తలపెట్టినా పూర్తి చేసే స్వభావం కలవాడు. తన కోపాన్ని పోగొట్టుకొనవలెనని తీర్మానించికదా తిరుక్కోయిలూరు వెళ్ళాడు! ఆ క్షేత్రంలో మూలవిగ్రహానికి ఎదురుగా ఒక మూర్తి వున్నాడు. వారు ఎవరో కాదు. పరమకోపనులైన దుర్వాసుల వారే, ఈ క్షేత్రంలో దుర్వాసమహరి సేవచేసి తన కోపాన్ని పోగొట్టుకొన్నారట. వారిమూర్తి శాంత్యానందములతో చిప్పిల్లుతూంటుంది. ఈ క్షేత్రంలో

బూజుపడుతున్న ఆలయాన్ని అనతికాలంలో వీరప్ప బాగుచేశాడు. దేవాలయం చుట్టూ గృహారామాలు ఏర్పడ్డవి. ఉత్తరపు వీథిలో వీరప్ప ఒక కుటీరం నిర్మించుకొన్నాడు. దేవాలయానికి రథం లేదు. ఒక రథాన్ని నిర్మించాలని కంకణం కట్టుకొన్నాడు. రథాన్ని పూర్తి చేసినాడు. రథాన్ని కైంకర్యమునకు వినియోగించేముందు బలిఇవ్వటం అలవాటు. కోడినో గొఱ్ఱనో బలి యివ్వవలెనని కొందఱు సూచించారు. వీరప్ప గారి పేద హృదయం దీనికి ఒప్పుకోలేదు. 'నేనుపోతే నాకై ఏడ్చేవాళ్ళు లేరు. రథాన్ని లాగండి. రథం కదలక పోతే నేనే రథం క్రింద పడడానికి తయారు' అని అన్నాడు.

అందరూ ప్రార్థించి రథాన్ని లాగారు. ఏ ఆటంకమూ లేక జగన్నాథుని రథం కదిలింది. వీరప్పస్వామి కుటీరంముందు ఇటుకపై నిలుచున్న కొంటె, పాడురంగనివలె- స్వామి రథస్థుడై నిలుచున్నాడు. వీరప్ప భావోద్వేగం వర్ణనాతీతం. స్వామికీ నీరాజనం ఇచ్చారు. కోపిష్టి వీరప్పస్వామి కన్నులశ్రు పూరితాలైనవి. హృదయంలో ఆనందం వెల్లి విరిసింది. ఆ తన్మయతలో వారి ప్రాణవాయువులు, మహాకాశంలో కలసిపోయినవి.

స్వామి షడ్గుణ సంపన్నుడు. మనమూ షడ్గుణోపేతులమే! కామ క్రోథాదికములకు మనకు ఏ కఱవూలేదు. మన గుణములను వారికిచ్చి, వారి గుణములను మనం తీసుకోవటమే దారి. ఆ దారి త్రిపురసుందరే చూపాలి! విపినం, భువనం, అమిత్రం, మిత్రం- లోష్టం చ యువతి బింబోష్ఠం-అని మూకకవి అంటాడు. పరదేవత అనుగ్రమున్న వారికి- ఈ వైరాగ్యం కలుగుతుందని అంటారు స్వాములవారు.

ప్రొద్దుగ్రుంకి చీకట్లుఆవరించి నంతచే చీకటులతో పాటు ఒక విధమైన ప్రకాశమూ ఏర్పడుతుంది. ఈ చీకట్లు వల్లనే ఆ ప్రకాశం ఏర్పడుతున్నది. ఈ ప్రకాశానికి కారణం ఆ చీకటే పగటిపూట కూడా జ్యోతిర్మండలమున్నది. నక్షత్రాలూ ప్రకాశిస్తూనే వుంటాయి. కాని మనకు కానరావు. సూర్యుడస్తమించి చీకట్లు ఆవరించేసరికి జ్యోతిర్మండలం -నయనగోచర మౌతున్నది. ఎన్ని చుక్కలు! ఎంత ప్రకాశం! ఎన్ని లక్షల మైళ్ళ దూరంలో ఈ మినుకు మినుకు మనే బ్రహ్మాండమైన చుక్కలున్నాయి? వీనినుండి కాంతి ప్రసార మవడానికి ఎన్ని ప్రకాశ సంవత్సరము లౌతున్నాయి. 'కాలోహ్యయ నిరవధికి విపులా చ పృథ్వీ' శివస్వరూపం నీకు గోచరించిందంటే ఈ దృశ్య ప్రపంచం నీ దృష్టినుంచి అంతరిస్తుంది. దృశ్య ప్రపంచం భాసించిందంటే శివస్వరూపం నీదృష్టి నుండి మరగిపోతుంది. ఈ సత్యాన్ని తెలుసుకో అంటారు స్వాములవారు.

మనం ఎప్పుడూ ఏదో ఒక ర్మ చేస్తుంటాము. పనిలేని వాడుండడు. ' న హి కశ్చిత్‌ క్షణ మపి జాతు తిష్ఠ త్యకర్మ కృత్‌' - ఐహిక వాంఛలతో మనం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ వుంటాము. కాని ఆ ఈశ్వరుడు ఇచ్ఛకూ, అనిచ్ఛకూ అతీతడుగా ఉంటున్నాడు. ఆయన కరుణా స్రవంతి అడ్డమూ, అలా లేక ఎల్లకాలములలో- సర్వతోముఖముగా ప్రవహిస్తూ వుంటుంది. వారి వారి అర్హతకొద్దీ యోగ్యతకొద్దీ ఫలం లభిస్తూంది. మనల నందరినీ నాలుగు తెగలుగా భగవంతుడు విభజించి వున్నాడు. ఆర్తుడు, ఆర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాసువు అన్నవే ఆ విభాగాలు, ఈ నలువురిలోనూ, జన్మపరంపర నుండి విముక్తి పొందేది జ్ఞాని ఒక్కడే. ఈశ్వరుడు నిష్ర్కియుడు, అకర్త, అసంగుడు, ఆయనచేసే కర్మకాని కర్మఫలం కాని ఆయనను బంధించడం లేదు. దీనిని తెలుసుకోవడమే ఈశ్వరతత్త్యం.

ఈశ్వరుడు ఈ విశాల ప్రపంచాన్ని సృష్టించి, తనకోసం దాచి పెట్టుకోకుండా విస్తారంగా మనముందు కుమ్మరించి కూరుచున్నాడు. ఆకాశము, భూమి, నక్షత్రాలు, పశువులు, పక్షులు, నరీనృపములు, కీటకములూ, చెట్లు, చేమలు నదులు, అరణ్యములు, వనములు, వాన, మంచు, గాలి, నిప్పు, నీళ్ళు మెరుపులు, మేఘాలు, దివారాత్రములు, ఒక్కటేమి, సమస్తమునూ, ఇంద్రజాలమువలె సృష్టించి, తాను నిష్ర్కియుడుగా కూరుచున్నాడు! ఈ భావం మనకు కలిగేసరికి పనిచేస్తున్నా పనిచేయని పిచ్చివానిపై ఒక ప్రేమ పుట్టుకొని రావటంలేదూ! మన హృదయాలు ఇట్లా అఖండంగా ప్రేమరస భరితములయితే ఈ ప్రేమ మధువును మనము అనుక్షణము ఆస్వాదించగలిగిన కుశలులమైతే, మన మనస్సులలో ఈ విశ్వ ప్రేమ చెరిగిపోని ముద్రగా నిలిచి పోగల్గితే- దుఃఖస్పర్శలేక- సదా ఆనందాంబుధిలో మునకలువేస్తూ మైమఱచి కూచోవచ్చు అని స్వాములవారంటారు ! ఈ జగత్తు చిచ్ఛక్తుల సమ్మేళనం. సర్వమూ ఈశావాస్యము. ఈ లోకం ఈశ్వరమయం. మనం చూచేదంతా ఈశ్వర స్వరూపం ఇక్కడ నానాత్వ మేమీలేదు. 'నేహ నానాస్తి కించన' లోకంలో ఎంతైనా చీకటి వుండవచ్చు. జ్ఞానభాస్కరు డుదయించి నట్లైతే ఈ చీకట్లు ఏమి చేస్తవి? ఆకాశంలో అరుణోదయం కాగానే చీకట్లు పలాయన మవటం లేదా? సమస్తవస్తువులూ, తమ కాంతినీ, శక్తినీ, అందాన్నీ, ఆకారాన్నీ ఆ సర్వేశ్వరుని మూలంగానే కదా పొందుతున్నవి? ఈ జగత్తును చిన్మయంగా భగవన్మయంగా చూడగల్గితే, ఒక మనిషి పోయాడని మనం దుఃఖిస్తామా? దుఃఖం తీరాలంటే భగవత్ర్పేమ వృద్ధి కావాలి- అని ఆచార్యు లంటారు.

అప్పయదీక్షితులవారు గొప్ప శివభక్తులు. వారికి హఠాత్తుగా ఒక సందేహం కల్గింది. 'నాకున్నది భక్తియేనా? లేక భక్తి అభాసమా? అని వారు తమ్ము తాము పరీక్ష చేసుకోవలెనని అనుకొన్నారు. మనం బుద్ధిపూర్వకంగా ఉన్మత్తావస్థను, తెచ్చుకొంటే, ఆ సమయంలో వివశ##మైన స్థితిలో మన ఆలోచనలు ఎలా వుంటవో అదే మన నైసర్గిక గుణం ఔతుంది. అని తీర్మానించి, మందు తిని పిచ్చివాడై పోయాడు. తాను తన పిచ్చితనంలో చెప్పేమాటలను మాత్రం వ్రాసివుంచమని తన శిష్యులకు చెప్పాడు. ఆ విధంగానే శిష్యులు, ఉన్మత్తావస్థలోవారు వాగినదంతా వ్రాసుకొన్నారు. అపుడు ఆయన ఆశువుగా ఏబదిశ్లోకాలు చెప్పాడట. దానికి ఉన్మత్త పంచశతి అనిపేరు. అందులో ఒక శ్లోకం.

అర్క ద్రోణ ప్రభృతి కుసుమై రర్చనం తే విధేయం

ప్రాప్యం తేన స్మరహర ఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః|

ఏత జ్ఞాన న్నపి, శివ శివ వ్యర్థయన్‌ కాల మాత్మన్‌

ఆత్మ ద్రోహీకరణ వివశో భూయసాధః పతాని ||

శివశివ! నీ అనుగ్రహం ఏమని వర్ణించను? సులభంగా లభించే జిల్లేడుపూలు, తమ్మిపూలు భక్తులనుండి సంగ్రహించి వారికి మోక్షసామ్రాజ్యలక్ష్మినే అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియక మేము మా కాలాన్ని వ్యర్థం చేసుకొంటున్నాము అని అప్పయదీక్షితులు చెప్పినది ఒక ఉపన్యాసంలో స్వాముల వారు వివరించారు.

గీతలో భగవంతుడు ఆత్మనిగ్రహానికి అభ్యాసవైరాగ్యములు అవసరమన్నాడు. మనం యత్నిస్తూనే ఉంటాము. మధ్యమధ్యలో జారిపోతూ వుంటాము. కాని జయం కలిగేంత వరకు మనం యత్నం చేస్తూనే వుండాలి. 'ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థము లుజ్జగింపరుకదా ప్రజ్ఞానిధుల్‌' అని భర్తృహరి అంటున్నాడు కోరికలన్నీ నివురు గప్పిన నిప్పువలె వుంటాయి. ఉపవాసాదికములచేత ఇతర తపశ్చర్యలచేత ఇంద్రియవిజయమూ, ఆత్మనిగ్రహమూ పూర్తిగా స్వాధీనం కాదు. సద్వస్తుజ్ఞానం కలగవలెనంటే మనం పూర్తిగా భగవంతుణ్ణి శరణం జొచ్చితేకాని వీలుకాదు. తపస్సూ, ఉపవాసములూ, ఆత్మసాక్షాత్కారానికి పూర్వరంగాన్ని కల్పించవచ్చు. కాని పరిపూర్ణనిగ్రహం కలసిరావాలంటే భగవదనుగ్రహం చేతనే కలగవలె. 'వాసుదేవ స్సర్వ మితి'అనే జ్ఞానం కలిగే వఱకూ పరిపూర్ణ మనోజయంలభించదు. ఎప్పుడైతే ఈ జ్ఞానం కలుగుతుందో అపుడు ఇంద్రియసౌఖ్యాలపై విముఖత ఏర్పడి బాహ్యవిషయాలు మనోవికారాన్ని కల్గించడానికి అశక్తములై, పరిపూర్ణ మనోనిగ్రహం సిద్ధించి ఎంతటి కష్టాలు వచ్చినా జారిపోని మానసికస్థితి ఏర్పడుతుంది.

ప్రబోధసుధాకరంలో ఆచార్యుల వారంటారు ;

చేత శ్చంచలతాం విహాయ పురతః

సంధాయ కోటిద్వయం

తత్త్రైకత్ర నిథేహి సర్వవిషయా

నన్యత్ర చ శ్రీ పతిమ్‌ |

విశ్రాంతి ర్హిత మస్య హా క్వను తయో

ర్మధ్యే త దాలోచ్యతాం

యుక్త్యా వానుభ##వేన యత్ర పరమా

వందశ్చ తత్సేవ్యతామ్‌ ||

మనస్సు త్రాసుముల్లు చలించే విధంగా చలిస్తుంది. మన ఆశలన్నీ ప్రోగుచేసి తక్కెడలో వుంచుదాం. మరొక్కచోట, తులాభారానికి ఎప్పడూ తయారుగా నున్న శ్రీపతిని ఉంచుదాం. ఏ తక్కెడమొగ్గో మనకు అర్థం ఔతుంది. పరమానందము ఎక్కడ ఉన్నదో యుక్తి చేత గానీ, అనుభం చేతగానీ తెలుసుకో.

కామకోటిమఠం ఉన్నది కంచిలో 'కథ కంచికి వెళ్ళిదన్న' నానుడి మీరు వినే ఉంటారు. మన కథలన్నీ కంచిలోనే పర్యవసానం కావాలి. ఆ క్షేత్రంలో ఈ త్రీభువనములనూ బొంగరమువలె తిప్పే ఒక స్త్రీ రత్నమున్నది. ఆమె కామకోటి పీఠాధిష్ఠాత్రి- చంద్రశేఖరునికి ఐశ్వర్యరూపిణిఐన కామాక్షి. ఆ రూఢ ¸°వనాటోప కంచికి మీరు వెళ్ళాలి. ఆ కామాక్షమ్మను చూడాలి. రెండుకళ్లూ చాలవు. మూకకవి ఆమెపైన మూకపంచశతిని వ్రాసినాడు.

ఆమ్ర తరుమూల వసతే

రాదిమ పురుష స్య నయనపీయూషమ్‌ |

ఆరబ్ధ ¸°వనోత్సవ

మామ్నా యరహస్య మంత రవలంబే ||

కంచిలోని స్వామి ఏకామ్రనాథుడు అనే ఆదిమపురుషుడు. ఆయనకు అమ్మవారు నయనపీయూషంగా వున్నదట. ఈశ్వరుడు అష్టమూర్తుల రూపంలో వున్నాడు. శంకరులవారు దక్షిణా మూర్తి స్తోత్రంలో ఈ విషయాన్ని -

''భూరంభాస్యనలో2నిలాంబర మహర్నాథో

హిమాంశుః పుమాన్‌''-

భూమి, నీళ్లూ, నిప్పు, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు- పురుషుడు - అనే రూపంలో వున్నట్లు చెప్పారు. ఆ అభవుని పత్నిని వర్ణిస్తూ మూకకవి-

ధరణిమయీం తరణిమయీం

పవనమయీం గగన దహన హోతృమయీం |

అంబుమయీ మిందుమయీ

మంబా మనుకంప మాదిమా మీక్షే ||

భూమి, సూర్యుడు, వాయువు ఆకాశమూ, అగ్ని సోమయాజి ఉదకము చంద్రుడు - అనే అష్టమూర్తుల రూపములో నున్న ఆదిమ జననిని కంపాతీరంలో చూస్తున్నాను- అని వర్ణించాడు.

ఈ మూకపంచశతి అనుత్తమమైన గ్రంథం. ఐదువందల శ్లోకములతో కూడినది. ఈ పుస్తకం అంటే స్వాములవారికి పరమప్రీతి.

ఇదే కాదు. భగవత్పాదులవారు వ్రాసిన సౌందర్యలహరి కూడ. వారి ఉపన్యాసాలలో ఎన్నో శ్లోకాలు సౌందర్యలహరి నుండీ ఉదాహరించి ఉన్నారు. సాధారణంగా కామాక్షి చిత్తరువు క్రింద ఈ క్రింది శ్లోకం ముద్రింపబడి ఉంటుంది.

త్వ దన్యః జాణిభ్యా మభయవరదో దైవగణ

స్త్య మేకా నై వాసి ప్రకటిత వరాభీత్యభినయా |

భయాత్త్రాతుం దాతుం ఫల మపి చ వాంఛాసమధికం

శరణ్య లోకానాం తవ హి చరణా వేవ నిపెణౌ ||

సర్వలోక శరణ్యవు నీవు. ఇతర దైవతములు, వరదాభయ ముద్రలుదాల్చి భక్తులను అనుగ్రహం చేస్తూ వుంటారు. నీవు మాత్రం అట్లాకాదు. కోరిన దానికి మించి అనుగ్రహం చేయగల శక్తితో గూడిన అభయంకరములైన నీ పాదములున్నప్పుడు- వరదాభయ ముద్రలనేహస్తవ్యాసంగ విక్షేపములకు అవకాశ మెక్కడ? అని ఆచార్యులు ఉప్పొంగిపోయాడు. ఈ శ్లోకంలో.

భగవంతుని స్వరూప మేమి? భగవతి ఆకారమేమి?

శంకరులవారు వ్రాసిన రెండు పుస్తకముల పేళ్ళలోనే

ఈ ప్రశ్నలకు బదులు అణిగివున్నది. ఒకటి శివానందలహరి. శివుడంటే - 'సద్యోజాతం ప్రపద్యామి' అన్నట్లు మరల మరల హృదయంలో ఉబుకుతన్న అతీంద్రియానందమే - శివా అంటే ఉమ ; హైమావతి ఆమె సౌందర్యలహరి ఒకరేమో ఆనందం. మరొకరేమో సౌందర్యం. సౌందర్యం ఆనందాన్ని పెళ్ళి చేసుకొన్నది. ఇ|శషషా ఠశ పశసస|d ఆ. ఈ విషయం తలచుకొని మనం ఆనందోన్మీలిత నేత్రులము కావలసినదేకదా

సౌందర్యలహరిలో 100 శ్లోకాలు, మొట్టమొదట ఉన్న 41 శ్లోకములను ఆనందలహరి అని అంటారు. అది మంత్రశాస్త్రము. మిగత 59 శ్లోకములు సౌందర్యలహరి. ఇక్కడా శివపార్వతులు, ఆనందసౌందర్యములు, వాగర్థముల వలె సంసృక్తత జెంది ఒకరి నొకరిని వదలక ఉన్నారు.

సౌందర్యలహరిలో హృదయాన్ని ద్రవింపజేసే శ్లోకాలు ఎన్నో వున్నవి. అందులో ఒక శ్లోకము.

తనోతు క్షేమ నస్తవ వదన సౌందర్యలహరీ,

పరీవాహస్రోతః సరణి రివ సీమంతసరణిః ||

అమ్మవారి ముఖసౌందర్యము అనే ప్రవాహమునకు వాలు గొమ్మువలె నున్నదట ఆమె పాపట. అది మా కెప్పుడు క్షేమమిచ్చుగాక అనియు;

దీనికి ముందున్న శ్లోకం

ధునోతు ధ్వాంతం న స్తులిత దలితేందీవరవనం

ఘనస్నిగ్ధంర్లక్షుం చికుర నికురంబం తవ శివే |

శివే ! మంగళప్రదురాలా! నల్లుకలువతోట వలె నున్న నీ ఘనకచపాళి- (కొప్పు) మా చీకటులను పోగొట్టగాక.

అనియు వ్రాయబడి యున్నది. 'తనోతు క్షేమం నః' 'ధునోతు ధ్వాంతం నః' - మనలను ఆవరించిన చీకట్లను అమ్మవారి నల్లని కచపాళి పోగొట్టాలి; అమ్మవారి పాపట అనే ముఖసౌందర్య స్రోతము -మనకు క్షేమం కలిగించ వలెనని శంకరులు ప్రార్థిస్తున్నారు. ఇట్లు సౌందర్యలహరి మన ధ్వాంతములను పోగొట్టి క్షేమమును ఇచ్చే, చిదానందలహరిగను, పరమానందలహరిగను, పర్యవసించుచున్నది. ఈ స్తోత్రగ్రంథము స్వాములవారికి ప్రియమైనది.

మూడవది- దుర్వాసమహరులు వ్రాసిన ఆర్యాద్విశతి. ఆర్యావృత్తముల యందు సావరణ విశేషముగా శ్రీపురమును వర్ణిస్తూ, ఆర్యా మహాదేవి. పైన వ్రాయబడిన రెండు వందల శ్లోకములు.

నేను ఆర్యాద్విశతిని గూర్చి విన్న దే కాని చూడలేదు. ఒకప్పుడు స్వాములవారు కంచిలో ఉన్నప్పుడు- ఈ ఆర్యాద్విశతి ఎక్కడ లభిస్తుందో చెప్పగలరా అని అడిగాను. స్వాములవారు బదులు పలకలేదు. కొంతసేపయిన పిదప- ప్రక్కన ఉన్న పరిచారకునితో-'ఈయన ఆర్యాద్విశతి ఎక్కడ దొరుకుతుందని నన్నడిగితే నాకేమి తెలుసు? అచ్చువేసే వాళ్ళని కదా అడగాలి' అని అన్నారు. నేను బదులు పలుకక ఊరకున్నాను.

కొంతసేపటికి గోడకు వ్రాలుకొని కూచున్నవారు నిటారుగా కూచున్నారు.

వందే గజేంద్రవదనం

వామాంకారూఢ వల్లభాశ్లిష్టం |

కుంకుమ పరాగ శోణం

కువలయినీజార కోరకాపీడమ్‌ ||

అనే శ్లోకాన్ని పఠించారు.

దానితో వారి అనర్గళ ఉపన్యాసానికి గణపతిపూజ ఐనది ఆ రోజు.

ఇది ఏమి వృత్తం? అని అడిగారు. 'ఆర్యావృత్తం' అని బదులు చెప్పాను. ఆర్యావృత్తములలో ఇంకా ఏమేమి పుస్తకాలు ఉన్నాయి? అని అడిగారు. కొందరు మూకపంచశతిలోని ఆర్యాశతకము -ఆర్యావృత్తములని బదులు చెప్పారు. ఇంకా వేరే ఏమున్నవి? అని అడిగారు. ఎవరికీ ఏమి చెప్పటానికి తోచలేదు. స్వాములవారే సదాశివ బ్రహ్మేంద్రులు వ్రాసిన ఆత్మవిద్యావిలాస మనే వేదాంతగ్రంథమూ ఆర్యావృత్తముల యందు వ్రాయబడినదని చెప్పారు. 'ఇంకా ఏమి ఉన్నవి! అని ప్రశ్న. దానికి నిరుత్తరమే బదులు. అంతటితో స్వాములవారు- భక్త్యావేశముతో - చేతులను పైకెత్తి ఈ క్రింది శ్లోకములను చెప్పసాగారు.

అమల కమలాథివాసిని

మనసో వైమల్యదాయిని మనోజ్ఞే,

సుందరగాత్రి సుశీలే

తవ చరణాంభోరుహం నమామి సదా.

అచలాత్మజా చ దుర్గా

కమలా త్రిపురేతి భేదితాజగతి,

యా సా త్వమేవ వాచా

మీశ్వరి సర్వాత్మనా ప్రసీద మమ.

త్వచ్చరణాంభోరుహయోః

ప్రణామహీనః పున ర్విజాతి రపి,

భూ యాదనేదమూక

స్త్వద్బక్తో భవతి దేవి సర్వజ్ఞ

మూలాధార ముఖోద్గత

బిసతంతునిభ ప్రభా ప్రభావతయా,

విసృతిలిపి వ్రాతాహిత

ముఖ కరచరణాదికే ప్రసీద మమ.

వర్ణ తనో2మృత వర్ణే

నియతమతిభి ర్వర్ణి తే2పి యోగీంద్రైః,

నిర్ణీత కరణదూరే

వర్ణయితుం దేహి దేవి సామర్థ్యం.

ససురాసుర మౌళి లసన్‌

మణిప్రభా దీపితాం ఘ్రియంగ నళినే,

సకలాగమ స్వరూపే

స్వర్వేశ్వరి సన్నిథిం విదేహి మయి.

పుస్తక జపవటహస్తే

వరదాభయచిహ్న చారు బాహులతే,

కర్పూరామల దేహే

వాగీశ్వరి విశోధయాశు మమ చేతః.

క్షౌమాంబర పరిధానే

ముక్తామణి విభూషణ ముదా వాసే,

స్మితచంద్రికా వికసిత

ముఖేందుబింబే అంబికే ప్రసీద మతు.

విద్యారూపే 2 విద్యానాశిని

విద్యోతితే న్తరాత్మవిదాం,

గద్యైః సపద్యజాతైః

అద్యై ర్మునిభిః స్తుతే ప్రసీద మమ.

త్రిముఖి త్రయీస్వరూపే

త్రిపురే త్రిదశాభివంది తాంఘ్రియుగే,

తీక్షణ విలసిత వక్త్రే

త్రిమూర్తి మూలాత్మికే ప్రసీద మమ.

వేదాత్మికే నిరుక్తజ్యోతి

ర్వ్యా2 కరణ కల్పశిక్షాభిః ,

సచ్ఛందోభిః సంతత

క్లుప్త షడంగేంద్రియే ప్రసీద మమ.



త్వచ్చరణ సరసి జన్మ

స్థితి మహితథియాం న లిప్యతే దోష ః,

భగవతి భక్తిమత స్త్వయి

పఠమాం పరమేశ్వరి ప్రసీద మమ.



బోధాత్మికే బుధానాం -

హృదయాంబుజ చారురంగ నటనపరే -

భగవతి భవభంగకరీం

భక్తి భద్రార్థదే ప్రసీద మమ.



వాగేశీ స్తవ మితి యో

జపార్చ నాహవన వృత్తిషు ప్రజపేత్‌,

స తు విమలచిత్తవృత్తి

ర్దేహాపది నిత్యశుద్ధ యేతి పదమ్‌.

వారి భావస్రవంతి శ్రోతలనూ రసోర్మిలో మునుకలు వేసేటట్లు చేసింది. ఈ స్తోత్రము భగవత్పాదాచార్యుల ప్రపంచ సారములోని దన్నారు. పిదప ఆర్యాద్విశతిలో దుర్వాస మహరి ఎట్లు పరవశులై అమ్మవారి వర్ణనచేశారో వివరించారు. 'కంచి కామాక్షి గుడిలో - శంకరభగవత్పాదుల సన్నిధికి దాదాపు ఎదురుగా ఒక విగ్రహం వుందే చూచారా. అది ఎవరిది?' అని అడిగి తామే ''అదుదాడికారర్థు'' (దాడేని చూపు తున్నట్లు అభినయం చేస్తూ అది దాడీగల ఆసామి దూర్వాసులది) అని అరవంలో అన్నారు.

ఇట్లు దేవీపరమైన స్తోత్రములలో స్వామికి ప్రియతరము లైనవి, మూకపంచశతి, సౌందర్యలహరి, ఆర్యాద్విశతి.

స్వాములవారు అంటారు. వ్యక్తాన్ని సాధనంగా ఉంచుకొని అవ్యక్తాన్ని సాధించాలని, అదే అనుమానం. భగవంతుడు మనకు అవ్యక్తంగా ఉన్నాడు. వ్యక్తంగా వున్నది. మనకంట ఎదుటిది మన గురుస్వరూపం. వెన్నను చేతిలో పెట్టకొని నేతికై ప్రాకులాడే వారున్నారా? గురుభక్తి దైవభక్తి కన్న గొప్పది. గురుభక్తి ఉన్నవాడికి శాంతి కరబదరకమే. మహాత్ములముందు మనం ఏది చదివినా మనశ్శాంతి వెంటనే లభిస్తుంది. ఆ శాంతి గ్రంథాలయాలలోనూ, క్లబ్బులలోనూ లభించటంలేదు. మనస్సు గురుభక్తితో ఆర్ద్రం కావాలి. అపుడే సద్యః ఫలం. మొదట మహాత్ములను అన్వేషించాలి. వారి ముఖతః ఉపదేశాలువినాలి. దేనినైనా గురుముఖంగా నేర్చుకోవాలి. శివుడు కోపగిస్తే, గురువు రక్షిస్తాడు. గురువు కోపగిస్తే రక్షించే నాథు డెవరూ లేరు. 'ఆచార్య దేవో భవ' అని శ్రుతి చెబుతున్నది. అందుచేత ప్రత్యక్షంగా ఉన్న గురువు మూలకంగా పరోక్షంలో ఉన్న భగవంతుడు- అద్వయమైన ఆపరోక్షానుభూతిలో అవగతమౌతాడు. అందులకే గీతాచార్యులు- ''ప్రియో2 పి మే - సత్యం తే ప్రతిజానే- మన్మనా భవ - మద్భక్తో భవ- మద్యాజీ భవ-మా మే వైష్యసి-'' నీకు సత్యప్రతిజ్ఞ చేస్తున్నాను. నీవు నాకు ప్రియుడివి. నీవు నామయమై పో. నా భక్తుడవైపో. నన్నే పూజించు. నన్నే పొందగలవు. అని ప్రేమతో బోధ చేస్తున్నారు. అందుచేత గురువు అంటే వేరే కాదు. సాక్షాత్‌ దక్షిణామూర్తియే. ''య స్సర్వోపరమేకాలే సర్వా నాత్మ న్యుపసంహృత్య స్వాత్మానందే సుఖేమోదతే ప్రకాశ తే వా స దేవః'' ''స్వాత్మానందం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే'' - స్వాత్మానంద ప్రకాశకుడైన దక్షిణామూర్తి-మన గురువే.

''నమో భగవతే తుభ్యం వటమూల నివాసినే

వాగీశాయ మహాజ్ఞానదాయినే మాయినే నమః -''

సంఘంలో మనం ఉంటూ వుండేదానివల్ల మనలో ప్రతిఒక్కరు మన పరిస్థితులు ఎట్లా ఉన్నా, కష్టములో ఉన్నవారికి మన చేతనయినంత ఉపకారం చేసేదానికి అలవాటు పడాలి, అని స్వాములవారు అంటారు. 'పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడన'పుణ్యం అంటే పరోపకారమే. పాపమంటే పరులకు పీడ కలిగించటమే. కొందరు ఎంత కష్టం వచ్చినా చెక్కు చెదరక- గుండ్రాయివలె 'యస్మిన్‌ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే- అన్న గీతా వాక్యానికి దృష్టాంతంవలె హరామరభయోద్వేగ ముక్తులై కూర్చునే పటిమ గల వారున్నారు. వారికి మనం చేయగలిగిన దంటూ ఏమీ ఉండదు. ఒక్క నమస్కారం తప్ప.

కాని లోకంలో చాలామంది, ఏ కొంచెం కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు. అట్టి అభాగ్య సోదరులకు మనం తాపశమనంగా నాలుగు మాటలు ఉత్సాహంగా చెప్పగలిగే అలవాటు పడాలి. ధనసహాయమో, దేహసహాయమో చేయాలి. భూతదయ భూతదయ అని వల్లెవేస్తే ప్రయోజనంలేదు. అది కార్యరూపంలో ఉండాలి. ఆభూతదయ జీవకారుణ్యరూపంలో అభివ్యక్తం కావాలి. ఈ కాలంలో ఆవుకు పిడికెడు గడ్డివేసే అలవాటుకూడా మనకు తప్పిపోయినది. లోకంలో ఉండేవారి కష్టాలన్నీ మనం పంచుకొని, భాగస్వాము లవటం అనేది సాధ్యంకాదు. అట్లా అని మన మూరుకోరాదు. 'స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌' అని స్వాములవారంటారు.

ఒక పాశ్చాత్యుడు స్వాములవారిని - 'ఉపాసన' అంటే ఏమి? అని అడిగాడు. స్వాములవారు 'ధ్యానమేవ ఉపాసనమ్‌' అని బదులిచ్చారు. సత్యమేమో ఒక్కటే. దానిలో మార్పు లేదు. అంతిమసత్యమైన ఆ రూపము నిరాకారమైనది. కాని మనము ఆ సత్యమునకు ఏ రూపమును కల్పించుకొని ధ్యానము చేస్తామో ఆ మూర్తివలన ఒక ప్రత్యేకమైన ప్రయోజనముంటుది. రెండు చేతుల మూర్తిని ధ్యానిస్తే కలిగే ఫలితం ఒకటి. ఎనిమిది చేతులు మూర్తిని ధ్యానిస్తే కలిగే ఫలితం ఒకటి. ఉపాసనా విధానాన్ని శాస్త్రాలు తెలుపుతవి. ఉపాసనలలో వైవిధ్యమున్నా ప్రయోజనం ఒక్కటే.

శాస్త్రములు ఎన్నో ఉపాసనలును చెప్పినవి. వాని నన్నింటిని అందరూ అనుసరించడం సాధ్యం కాదు. అవసరమూ లేదు. ఏదో మనకు ఇష్టమైనది, గురువు నిర్దేశించినది. మనం చేయటానికి అలవాటుపడాలి. ఉపాసన వ్యక్తిగతం. సాముహికం కాదు. ఉపాసన క్రమానుగతంగా వచ్చినదో - (వంశాచారము అనుసరించి) గురువు ప్రసాదించిన దీక్షను అనుసరించియో వుంటుంది.

జ్ఞానమువేరు. ఉపాసనవేరు. ఉపాసనలో మానసిక కర్మ ఉన్నది. జ్ఞానము మానసిక భూమికకు చేరినా అందులో కర్మలేదు. ఒక విధిని అనుసరించి చేసేది కర్మ. జ్ఞానోదయమైతే మనస్సు స్వరూపస్థితిలో నిలచిపోయి, ఏ విధిని అనుసరించదు.

ఒకరు పాశ్చాత్యదేశాలకు మీరివ్వగలిగిన సందేశ##మేమని స్వాములవారిని అడిగారు.

'మీరు చేసేపని ఏదైనా సరే- దానికి ప్రేమ ముఖ్య కారణంగా వుండాలి. కార్యం అంటే కర్త- కర్తకు భిన్నులైన ఇతరులూ వుంటారు. ఏ కార్యమైనా సరే- అది ప్రేమకారణంగా వుండాలి. ఒకప్పుడు మనం ఇతరులను హింసించవలసి వస్తుంది. యుద్ధములు చేయవలసి వస్తుంది. అప్పుడుకూడ. మన హృదయాలలో ద్వేషభావం ఉండరాదు.'ఈ కర్మ సంస్కార కారణంగా చేయబడుతున్నది. దీనిలో ద్వేషానికి తావులేదు.' అన్న భావంతో మనం చేసే ప్రతికార్యంలోనూ ప్రేమ ఓతప్రోతమైపోతే ఎట్టి గడ్డుసమస్యలైనా మనం అవలీలగా సాధించగలం- అని స్వాములవారు సందేశ మిచ్చారు.

స్వాములవారు ఉపవాస కృశులు. చాలా రోజులు నిరాహారంగానే వుంటారు. లేకుంటే గుప్పెడుపేలాలు పాలలోనో, పెరుగులోనో, నానబెట్టి కొంత స్వీకరిస్తారు.

'రాత్రి త్రయంబులు బ్రహ్మ క్షత్రియులకు నుపవసింప

జను-తదధికమున్‌ గాత్రస్థితి తప్పింపని మాత్ర నయిన మేలు.'

పౌర్ణమాస్య-పూర్వపక్ష అష్టమి- చతుర్దశి- ఉభయపక్షములలో షష్ఠి పంచమి- సునిష్ఠమై ఉపవాసమున్న వివిధశుభము లొలయునండ్రు- అని భారతము చెబుతున్నది. ఏకాదశి ఉపవాస మందరికీ తెలిసినదే. ఉపవాసవ్రత సేవనము శరీరమునకు చిత్తమునకు పావనము. ఐహిక మహిమ, దేవనిలయము- ఉపవాసవిధిచే కల్గునని శాస్త్రము.

మనం చేసే ప్రతికార్యమూ ఈశ్వరార్పణము కావలెనని స్వాములవారంటారు.

అహంకర్తేశ్వరాయ భృత్యవత్‌

కరోమీతి అనయా బుద్ధ్యా- శంకరులు

ఈశ్వరప్రేరితో హం కరోమీతి

అనయా బుద్ధ్యా- నీలకంఠ

మయి సర్వాణి కర్మాణి నాహం కర్తేతి

సన్యస్య స్వతంత్రః పరమేశ్వర ఏవ

సర్వకర్తా నాహంకశ్చిత్‌ ఇతి నిశ్చిత్య- అభినవగుప్తుడు.

అందుచేత మనం చేసే ప్రతికర్మయు ఈశ్వరార్పణబుద్ధితో చేసి న్యస్తభరులమైపోతే మనకు నిర్లిప్తత, అసంగత్వం, తానుగా అలవడుతుందని స్వాములవారంటారు. సుఖదుఃఖములు ఎప్పడూ మన సహచరులే-'' నీచైర్గచ్ఛ త్యుపరి చ దశా చక్రనేమి క్రమేణ' చక్రం ఒకమారు పైకి వస్తుంది. ఆ భాగం మరల అడుగు భాగానికి పోతుంది. మరల పైకి వస్తుంది. సంసారమూ చక్రమే. 'చక్రవత్‌ పరివర్తేతే సుఖదుఃఖే నిరంతరం' సర్వమూ ఈశ్వరసంకల్ప మనుకొన్నపుడు సుఖదుఃఖములు బాధింపవు.

స్వాములవారు ఒక మారు అన్నారు. కామకోటి రామకోటి అయిందని. రామనామకోటిని వ్రాసి భక్తులు స్వామికి సమర్పిస్తూంటారు. కంచికామాక్షికి, అయోథ్య పరిపాలించిన శ్రీరామునికీ సంబంధమేమి? అంటే లలితాపరాభట్టారిక శ్రీ త్రిపురసుందరి ఐన కామాక్షీ శ్రీరామచంద్రమూర్తి ఒక్కరే అని సీతా అమ్మవారు రామాయణంలో శ్రీరాముణ్ణి నీవు పురుషుడవుకావు- స్త్రివి-'స్త్రియం పురుషవిగ్రహమ్‌' అని దెప్పిపొడుస్తుంది. దీనిలో ఆమె వాస్తవమే చెప్పింది.

వాల్మీకి నారదమహరికి కొన్ని ప్రశ్న లడుగుతాడు;

'కో న్వస్మిం త్సాంపత్రం లోకే గుణవా న్కశ్చ వీర్యవాన్‌,

ధర్మజ్ఞ శ్చ క్పతజ్ఞ శ్చ సత్యవాక్యో దృఢవ్రతః

చారిత్రేణ చ కో యుక్త స్సర్వ భూతేషు కో హితః,

విద్యా న్కః క స్సమర్థ శ్చకశ్చైక ప్రియదర్శనః?

ఆత్మవాన్‌ కో జిత క్రోధో ద్యుతిమా న్కో2 నసూయకః ,

కస్య బిభ్యతి దేవా శ్చ జాతరోషశ్య సంయుగే?-

ఈ లోకంలో గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మము నెఱిగినవాడు, కృతజ్ఞుడు, సత్యవాది, అచలసంకల్పము కలవాడు ఎవడు?

పరంపరాగతమైన సదాచారముతో కూడినవాడు, సర్వ భూతహితుడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు ఎవడు? ఆత్మవంతుడు, క్రోధమును జయించినవాడు, కాంతి గలిగినవాడు. అసూయారహితుడు, కోపమువచ్చినచో దేవతలకు కూడా భీతి కలుగచేయువాడు ఎవడు?

ఇవి వాల్మీకి ప్రశ్నలు. నారదమహరి ముక్తసరిగా- ఈ గుణములన్నీ కలవాడు శ్రీరామచంద్రమూర్తి ఒక్కడే అని బదులిస్తాడు. ఆ రామనామస్మరణ చేయవలెనని స్వాముల వారి బోధ. మన వ్యాధుల కన్నిటికీ రామనామమే మందు.

ఆర్థర్‌ ఐసన్‌ బర్గ్‌ అనే పాశ్చాత్యుడొకడు స్వాములు వారిని కలుసుకొన్నాడు. అతడు 'సరి అయిన ప్రశ్న వేయటం జ్ఞానోదయానికి ప్రాతిపదిక అని అంటారుకదా? నేను జ్ఞాని అనే అనుకొందాం అప్పుడు నేను మిమ్ములను అడుగవలసిన ప్రశ్న ఏది?' అని అడిగాడు. స్వాములవారు, తమ అలవాటు ప్రకారం కొన్ని క్షణములు ఆగి- 'మీరు జ్ఞానులైతే ఏ ప్రశ్నలూ వేయరు' అని బదులిచ్చారు. స్వాములవారు ఇతనితో చేసిన సంభాషణలో- ఒక గంభీరమైన సత్యాన్ని బోధించారు. ''మనం చేసే అన్వేషణమే ఆనందమూ, సుఖమూ ఒక సుఖం మనము పొందినాము. అంటే అది సుఖం కాదు ; సుఖస్వరూపంగా ఉండటమే సుఖం''అని.

జగద్గురు బోధలు ఏడవభాగం, గౌడపాదులు, వారి శిష్యులు గోవిందభగవత్పాదాచార్యులు, వారి శిష్యులు, శ్రీమచ్ఛంకర భగవత్పాదులు, వారి శిష్యవర్గము, సురేశ్వరులు, పద్మపాదులు, తోటకాచార్యులు, హస్తామలకులు. వీరిని గూర్చినది. ఇందులో రస వంతము లైన కథలను ఎన్నో స్వాములవారు చెప్పారు.

శంకరులవారు కాశీలో వాసంచేస్తూ జ్ఞాన ప్రచారం చేస్తూన్నారు. తాను బోధించేది అనుభవం ఉండి చెపుతున్నాడా లేక నోటిమాటగా చెపుతున్నాడా? అని ఆచార్యులను కాశీ విశ్వేశ్వరుడు పరీక్షించదలచి ఒక మాలవాని వేషంలో వచ్చాడు. ఆచార్యులవారు మాలవానిని దూరంగా తొలగమన్నారు. కాని ఆ మాలవాడు అట్లా తొలగలేదు.

అన్నమయా దన్నమయం అధివా

చైతన్య మేవ చైతన్యాత్‌

ద్విజవర దూరికర్తుం వాంఛసి

కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి?

ఓ బ్రాహ్మణోత్తమా? దేనిని మీరు తొలగ మంటున్నారు అన్నమయమైన శరీరమును శరీరమునుండి తొలగ మంటున్నారా? లేక చైతన్యమును చైతన్యమునుండీ తొలగ మంటున్నారా? మీరేమో'అహం బ్రహ్మస్మి' శివో 2 హం అని అంటున్నారుకదా? దీనికేమి అర్థం? - అని ప్రశ్నించాడు. అంతటితో ఆచార్యుల వారు మీరు ఇట్టివారా? బ్రాహ్మణుడైనాసరే, చండాలుడైనాసరే బ్రహ్మవేత్త అయితే అతడు నాకు గురువే- అని మనీషా పంచకమనే అయిదు శ్లోకం-

జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థిరతరా యా సంవి దుజ్జృంభ##తే

యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణీ,

సైవాహం న చ దృశ్యవ స్త్వితి దృఢ ప్రజ్ఞాపియస్యాస్తిచేత్‌

చండాలో 2 స్తు సతు ద్విజో2 స్తు గురు రిత్యేషా మనీషామమ||

జాగ్రత్స్వప్న సుషువులలో ఏ చైతన్యం మిక్కిలి స్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుందో, ఏది చీమ మొదలు బ్రహ్మవరకూ సర్వశరీరములలోనూ సాక్షిగా నెలకొని ఉన్నదో ఆ చైతన్యమే నేను, ఈ దృశ్యమైన జడవస్తువునుకాను, అనే జ్ఞానం ఎవనియందు సుదృఢంగా ప్రకాశిస్తున్నదో- వాడు చండాలుడైనాసరే బ్రాహ్మణుడైనాసరే నాకు గురువు- అని ఆచార్యులు, ఆ చండాలునికి నమస్కరించారు.

సంధ్యాసమయంలో పరమేశ్వరుని చరణారవిందములను ధ్యానించాలి. అందరూ ఏకాదశివ్రతం ఆచరించాలి. దేవీ నవరాత్రములు; గోకులాష్టమివలెనే వైశాఖశుద్ధపంచమినాడు ప్రతి సంవత్సరమూ వచ్చే శంకరజయంతిని వైభవంగా జరపాలి. ఈ విధంగా చేయటం వల్ల, ఆచార్యుల అనుగ్రహమునకు పాత్రులమై మనకు సకలసన్మంగళములూ కలుగగలవని స్వామివారు బోధిస్తారు.

ఆనందంకోసం అన్వేషణ అంతర్ముఖంగా చేయాలి. ఆనందంగా కనిపించే ఆనందాభాసాలకు మనం పాల్పడితే దుఃఖమే మిగులుతుంది. లోనఉన్న మహానందప్రవాహంలో మనం అవగాహనం చేయాలి. ఇంద్రియాలను నియమించి అంతర్ముఖత్వాన్ని అలవరచుకోవాలి. దీనినే 'ఆనందం బ్రహ్మేతివ్యజనాత్‌ - రసో వైసః - అనటం లోపల ఉన్న శక్తి మనము ఎపుడు చూడగలుగు తున్నామో - బయటి ఆవరణ యొక్క కృత్రిమరూపం బోధపడుతుంది. మూలపదార్థ విజ్ఞానమేర్పడిన పిదప వివిధోపాధులలో ఉన్నది ఒకే చైతన్య మని తెలుసుకొంటాము. లోపలా బయటా ఉన్న శక్తి ఒక్కటే అన్న నిశ్చయ జ్ఞానం కలిగే సరికి దోషదృష్టి అంతరించి, 'నిర్దోషం హి సమం బ్రహ్మ' అన్న బ్రాహ్మీస్థితి ఏర్పడు తుంది.

అట్టి బ్రాహ్మీస్థితి సనత్కుమారుల వారిది. వారు ఆత్మారాములు, పరబ్రహ్మను తనలోనే దర్శిస్తూ కూరుచున్న పరమజ్ఞానులు. ప్రపంచమే ఒక స్వప్న మని భావించే పరమ విరాగులు. వారికి చెట్టూచేమ, గుట్టారాయీ అంతా ఒకటి గానే కనబడింది. వారి దృష్టిలో అంతా బ్రహ్మమయం.

ఈ స్థితిని సదాశివ బ్రహ్మేంద్రులు ఒక కీర్తనలో చాలా సుందరముగా వర్ణించారు ;

గీ|| సర్వం బ్రహ్మమయమ్‌- రే రే - సర్వం బ్రహ్మమయమ్‌ -

1. కిం వచనీయం కి మవచనీయం

కిం రచనీయం కి మరచనీయం- ||సర్వం||

2. కిం పఠనీయం కి మపఠనీయం

కిం భజనీయం కి మభజనీయం- ||సర్వం||

3. కిం బోధవ్యం కి మబోధవ్యం

కిం భోక్తవ్యం కి మభోక్తవ్యం- ||సర్వం||

4. సర్వత్ర సదా హంసధ్యానం

కర్తవ్యం భో ముక్తినిధానమ్‌. ||సర్వం||

ఆత్మను మనం వెదికికోని పోనవసరంలేదు. క్రిందా పైనా ముందూవెనుకా, కుడి ప్రక్కా, ఎడమప్రక్కా, అంతా ఆత్మయే. ఇట్లు ఒకడు ధ్యానించి ధ్యానించి, ఆ ఆత్మస్వరూపుడైతే ఆ ఆత్మతత్త్వంలోనే ఎపుడూ విహరిస్తుంటాడు. సామ్రాజ్యం, స్వరాజ్యం అంటే అదే. ఈ స్వారాజ్యస్థితికి అడ్డువచ్చేవి, అహంకార మమకారములే.

త్యక్తవ్యో మమకారః త్యక్తుం యది శక్యతే నానే |

కర్తవ్యో మమకారః కింతు సర్వత్ర కర్తవ్యః ||

మమకారం మనం వదలిపెట్టాలి. అట్లా వదలి పెట్టడానికి అశక్తులమైతే, ఆ మమకారం సర్వత్ర చేస్తే సరిపోతుంది?

జన్మాద్యస్య యతో 2 న్వయా దితరత

శ్చార్థే ష్వభిజ్ఞః స్వకాట్‌

తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే

ముహ్యంతి య త్సూరయ ః |

తేజో వారి మృదాం యథా వినిమయో

యత్ర త్రిసర్గో మృషా

ధామ్నా స్వేన సదా నిరన్తకుహకం

సత్యం పరం ధీమహి || భాగవతము.

ఈ ప్రపంచముయొక్క జన్మస్థితిలయములు ఎవనిచేత కలుగుచున్నవో అతడు అభిజ్ఞుడు- సర్వజ్ఞుడు, స్వరాట్‌ - అతడు అనుస్యూత మగుచుండును. అతడు జగత్కారణుడు. ఏవేద విషయమునందు - సూరయో2 పి- యోగులు సహితము ముహ్యంతి- మోహము చెందు చున్నారో- అట్టి వేదములను బ్రహ్మకు విశదమగునట్లు చేసిన బుద్ధిశాలి. అతని యందు త్రిసర్గః భూతేంద్రియ దేవతా రూపమైన తమోరజస్సత్త్వ సృష్టి స్వభావముచే సత్యము కాకపోయిననూ సత్యమువలె తోచుచున్నది. అతడు తన తేజస్సుతో నిరస్తకుహకం. ఈ మాయా ప్రపంచమును నిరసిస్తున్నాడు. అట్టి పరమసత్యమును ధ్యానింతుము గాక - 'సత్యం పరం ధీమహి'-

మరొక విషయం తఱచు స్వాములవారు బోథించేది ఇది.

పుణ్యస్య ఫల మిచ్ఛంతి పుణ్యం నేచ్ఛన్తి మానవాః |

న పాపఫల మిచ్ఛంతి పాపం కుఠ్వంతి యత్నతః ||

పుణ్యఫలం సుఖం ; పాపఫలం దుఃఖం; పుణ్యఫలంమైన సుఖాన్ని అందఱూ కోరుకొంటారు. కాని పుణ్యమును (చేయ) కోరుకోవటంలేదు. అదేవిధంగా పాపఫలమైన దుఃఖమును ఎవడూ కోరుకోవటంలేదు ; కాని ప్రయత్నంచేత పాపం చేస్తుంటాడు. ఈ పాపం పోయేదెట్లా?'ధర్మేణ పాప మపనుదతి' ధర్మము చేత పాపమును పోగొట్టుకొనవలెను. సర్వధర్మములలోనూ ఏది పరమ ధర్మము? ''కో ధర్మః సర్వధర్మాణం భవతః పరమో మతః కిం జప న్ముచ్యతే జంతుః జన్మసంసార బంధనాత్‌?'' అని ధర్మరాజు భీష్మాచార్యులను అడుగగా -

జగత్ర్పభుం దేవ దేవ మనన్తం పురుషోత్తమమ్‌ |

స్తువన్‌ నామసహస్రేణ పురుషః సతతోత్థితః |

సర్వదుఃఖాతిగో భ##వేత్‌ .... .... ..... ||

పురుషుడు జీవుడు. నవద్వార పురములో శయనించి ఉన్నవాడు. ప్రయత్నంతో పాపములను చేస్తున్నాడు. కాని, పాపఫలములను అతడు కోరుటలేదు. అతడు మరొక ప్రయత్నముకూడా చేయవలసి ఉన్నది. సతతోత్థితః - ఎల్లప్పుడు పూనిక కలవాడై - స్థావర జంగమరూపముగల ఈ జగత్తుకు ప్రభువైన - పురుషోత్తముని - విష్ణువును, పురుషుడు - జీవుడు నామసహస్రములచే కీర్తించిన 'సర్వదుఃఖాతిగో భ##వేత్‌'-సర్వదుఃఖములను మీరిన వాడగును. ఈ విషయమునే సంస్థాపనచేస్తూ - శ్రీకృష్ణుడు.

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామిమాశుచ ||

అని గీతలో ఉపదేశించారు.

ఆ పురుషోత్తముడు అనాదినిధనుడు - ఆరువిధములైన మార్పులు లేనివాడు. సర్వవ్యాపకుడు - సర్వలోక మహేశ్వకుడు. అట్టి పరమేశ్వరుని నామ సహస్రముచేత అర్పించి సుఖము పొందనగును.

ఈ సహస్రనామ జపము మానసస్నానము వంటిది. జ్ఞానవాపికలో, ధ్యానజలములో స్నానంచేస్తే, రాగద్వేష మలాపహరంగా ఉంటుంది. మఠంలో అనుదినమూ విష్ణు సహస్రనామ పారాయణ ఉంటుంది. స్వామిసమక్షంలో చేస్తుంటారు. స్వాములవారు కళ్లు మూసుకొని, విష్ణు సహస్ర నామ లహరిలో మునిగి మైమరచి వుంటారు !

భగవత్స్మరణ కంటే పాపమోచనకు పరమౌషధం వేరే లేదు.

కృష్ణేతి వైష్ణవం మన్త్రం శ్రుత్వా ముక్తో భ##వే న్నరః |

ఆలోడ్య సర్వశాస్త్రాణి విచార్య చ పున ః పునః ||

ఇది మేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణః సదా |

హరి ర్వదతి పాపాని దుష్టచిత్తై రపి స్మ్రతః ||

అనిచ్ఛయాపి సంస్ప్రష్టో దహ త్యేవహి పావకః |

కిం చిత్రం తదఘం ప్రయాతి విలయం తత్రాచ్యుతే కీర్తితే

హరే ర్నామైవ నామైవ నామైవ మమ జీవనం |

కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా ||

స్తుత్వా విష్ణుం వాసుదేవం విపాపో జాయతే నరః |

ప్రాయశ్చిత్తా న్య శేషాణి తపః కర్మాత్మకాని వై ||

యాని తేషా మశేషాణాం కృష్ణానున్మరణం పరమ్‌ |

సకృత్స్మ్రతో 2 పి గోవిందో నృణాం జన్మశ##తైః కృతమ్‌ ||

పాపరాశిం దహ త్యాశు తూలరాశి మివానలః |

యే నమస్యన్తి గోవిందం న తేషా విద్యతే భయమ్‌ ||

ఏకో 2 పి కృష్ణే సుకృతః ప్రణామః

దశాశ్వమేధావ బృథేవ తుల్యః |

దశాశ్వమేథీ పున రేతి జన్మ

కృష్ణప్రణామి న పునర్భవాయ ః ||

కృష్ణ అనే మంత్రమును విన్నవాడు ముక్తుడగును. సర్వ శాస్త్రములను చక్కగా ఆలోచనచేసి చూడగా తేలిన విషయము - నారాయణుని ధ్యానింపవలయు ననియే.

దుష్టచిత్తము కలవారు కూడా హరిని స్మరించిన పాపములు పోవును. తెలియక నిప్పును తాకిననూ అది దహించక వదలదు కదా!

అచ్యుతుని కీర్తించిన పాపములు పోవుననుటలో చిత్రమేమున్నది? హరినామమే ముమ్మాటికి జీవనము. అంతకంటే ఈ కలికాలములో వేరేగతిలేదు.

సర్వవ్యాపకుడైన వాసుదేవుని స్తుతించి నరుడు పాప విముక్తుడగును. ప్రాయశ్చిత్తములు తపోరూపములు, కర్మరూపములు, అన్ని ప్రాయశ్చిత్తము లందును, కృష్ణానుస్మరణమే ప్రశస్తమైనది.

గోవిందుని సకృత్స్మరణము, అనేక జన్మార్జిత పాపరాశిని, అగ్ని దూదిని దహించునట్లు దగ్ధము చేయును.

గోవిందుని నమస్కరించు వానికి భయము లేదు.

శ్రీకృష్ణునికి చేసిన ఒక్క ప్రణామము, పది అశ్వమేధయాగములకు సమానమైనది, కాని అశ్వమేధములు చేసిన వానికి పునర్జన్మకలదు. కృష్ణప్రణామికి - పునర్జన్మ లేదు. లేదు.

మన కష్టముల కన్నిటికీ కారణం ద్వైతభావనమే. అద్వైతస్థితిలో ఉన్నవానికి ఏ బాధయులేదు. ఆ అద్వైతవాసన ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ కలుగదు. 'ఈశ్వరానుగ్రహా దేవ పుంసా మద్వైతవాసనా' ఈశ్వరానుగ్రహమునకు మూడిషయములు ముఖ్యము ; మనుష్యత్వము, ముముక్షుత్వము త్వము, మహాపురుష సంశ్రయము, మహాపురుషులైన స్వాములవారు పీఠమునకు వచ్చి ఏబదిఏండ్లు పూర్తి అయిన పిదప చేసిన ఒక ఉత్సవసందర్భంలో - ఇలా చెప్పారు.

మనమందరమూ ఈశ్వరానుగ్రహమునకే గట్టి ప్రయత్నము చేయవలెను దానివలన అందరికీ మేలు. ఈశ్వరుడు మనకెంత ఆయువు నిచ్చియున్నాడు, ఆ ఆయువంతా ఈశ్వరానుగ్రహ సంపాదనార్థమే మనము వినియోగించాలి. ఏకం అపి క్షణ మీశ్వరానుగ్రహార్థ ప్రయత్నం వినా యది వ్యయీ కుర్మః తర్హి అస్మజ్జన్మ వ్యర్థం భ##వేత్‌' ఈశ్వరానుగ్రహమునకు ప్రయత్నముచేయక ఒక్క క్షణమైనా మనము వ్యయముచేసిన మనజన్మ వ్యర్థమే. ఆ ఈశ్వరానుగ్రహము అందరిపై ప్రసరించవలెననీ, అందరూ ఈశ్వరభక్తి భరితులై ఉండవలెననీ పరమేలవ్వరుని మనము ప్రార్థించాలి.

మేము పీఠమునకు వచ్చి ఏబది ఏండ్లయినది. ఈ ఏబది ఏండ్లలో ఏమి చేసినామని వెనుదిరిగి చూచుకొనే దానివలన ప్రయోజనములేదు. భగవంతుడు అనుగ్రహించిన శేషకాలమును ఎట్లా వినియోగించాలో దానిని గూర్చి యోచించడం ఉత్తమం. అట్లు మేము చేయవలసిన కర్మ ఏది? నైష్కర్మ్యమే - కాని ఏపనిచేయక ఊరక కూర్చోవటం నైష్కర్మ్యము కాదని గీతలో శ్రీకృష్ణుడు పదే పదే సెలవిస్తున్నాడు. 'పరం తు కర్మణౖవ నైష్కర్మ్యం సంపాదయితుం శక్యతే' కర్మచేతనే నైష్కర్మ్యస్థితి సంపాదించవలె. ''కిం తత్‌ కర్మ అతితీవ్రమ్‌? యేన కర్మణా అస్మాభిః నైష్కర్మ్యం సంపాదనీయం భ##వేత్‌?'' అకర్మ అతితీవ్రమా? ఏ కర్మచేత మేము నైష్కర్మ్యమును సంపాదింపగలము?

ఇచ్చట భగవత్పాదులవారి ఆజ్ఞనేస్మరిస్తూ, అందరినీ స్మరింపచేస్తున్నాము.

''కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతా మపచితిః ఇతి స్వం స్వం కర్మం సమ్యక్‌ అనుతిష్ఠామః స్వ స్వక ర్మాను ష్ఠాన మేవ భగవతః పూజా- భగవతః ఆరాధనం భగవదనుగ్రహస్య ద్వారమ్‌. తస్మాత్‌ స్వే స్వే కర్మణినిష్ఠాః వయం తేన కర్మణా భగవన్తం అర్చయన్తః పరం శ్రేయః సంపాదయామః

మీమీ కర్మలను మీరు సకృత్తుగా చేయండి. అదే ఈశ్వరార్చన అని వారన్నారు. స్వకర్మానుష్ఠానమే భగవత్పూజ భగవదారాధన. భగవదనుగ్రహమునకు ద్వారము అందుచే మన మన కర్మలను చక్కగా చేసి, భగవంతునికి అర్పించి పర శ్రేయమును పొందెదముగాక -

ఇట్లు స్వకర్మానుష్ఠానమే ఈశ్వరార్చన. ఈశ్వరానుగ్రహమునకు హేతువై, నైష్కర్మ్యమంటే - ఎడతెగకుండా కర్మ చేయటమే. అట్లు నైష్కర్మ్య రూపకముగా కలిగిన ఈశ్వరానుగ్రహము ద్వారా అద్వైతస్థితి ఏర్పడుతుంది. స్వాములవారంటారు. మరి అద్వైతం అంటే ఏమి? ఆ అద్వైతంవలన మనకు కలిగే లాభ##మేమి? దానిని మనము తెలుసుకోగలమా? లేక ఈ అద్వైతమూ ఊహాప్రపంచమునకు సంబంధించినదేనా? వాస్తవికంగా అద్వైతం మనకు ప్రయోజన కారియా?

అద్వైతము అంటే రెండవది లేనిది అని అర్థము. ఈ దృశ్యప్రపంచములో మన మెన్నో చూస్తున్నాము. లేవంటే ఎట్లా పొసగుతుంది? అపుడు మనంచేసే ప్రయత్నములకు ఫలమేమి? దారిద్ర్యం, ఆకలి, దప్పిక, రోగం, మానసికంగా వున్న అశాంతి- పోగొట్టుకొనేందుకు ఎంతో తికమక పడుతున్నాముకదా? ఇవి లేనిచోటు, స్థితి, ఏదైనా ఉన్నదా? ఇవి తీరని బాధలైతే మనం దేనికోసం ఇట్లా వ్యర్థంగా శ్రమిస్తున్నాము? ఇంత ప్రయత్నం చేసే, తాత్కాలికోపశమనము మాత్రమే కలిగితే - అంతా వ్యర్థప్రయాసయే కదా? లేక శాశ్వత నివారణ ఏదైనా ఉన్నదా?

కొంచెం యోచించిచూస్తే, మనకు ఆకలి దప్పిక మొదలైనవన్నీ దేహం వున్నందువల్ల కలుగుతున్నదని తెలుస్తుంది. ఇవి దేహధర్మములు, ఈ దేహం లేకపోతే ఈ బాధలూ వుండవు. కాని ఈ దేహంపోతే మరొక్క దేహం రాగలదు. ఈ దేహములు కావటానికి కారణమేమి? మనం చేసే సుకృతదుష్కృతముల ఫలమును అనుభవించుటకై మనం దేహమును ధరిస్తున్నాము. ఆత్మను ఏవీ అంటవు. 'నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ' ఈఆత్మను శస్త్రములు ఛేదించవు; అగ్ని దహింపలేదు. అందుచేత ఆత్మకు సుఖ దుఃఖముల అనుభవమునకు ఒక దేహం కావలసివస్తుంది. కర్మఫల ప్రదాత అయినా ఈశ్వరుడు మనకు ఒక దేహాన్ని కల్పిస్తున్నారు. ఈ దేహమే 'మనము' అనే భావన మనకు కలుగజేసి మనలను శిక్షిస్తున్నాడు. ఒక పిల్లవాడు తప్పుచేస్తే మనం దండిస్తున్నాము. బెత్తముతో కొట్టుతున్నాము. వాడునొప్పికి తాళ##లేక మూర్ఛపోతే, వానికి శీతలోపచారాలు చేసి మళ్ళా నాలుగు వడ్డిస్తున్నాము. అదే విధంగా భగవంతుడు మనకు దేహమిచ్చి శిక్షిస్తున్నాడు. ఇచ్చిన శిక్ష చాలకపోతే మరొక్క దేహమును ప్రసాదిస్తున్నాడు. దేహధారణకు మనం చేసే పాపాలే కారణము.

మనం పాపాలెందుకు చేస్తున్నాము? కామం కారణంగా చేస్తున్నాము. ఒక వస్తువునుచూచి మనకు కోరిక కలుగుతున్నది. ఆ వస్తువును పొంద డానికి ఎన్ని అక్రమములకైనా పాటుపడతాం. ఒక వస్తువు సుందరంగా వున్నదంటే కోరిక కలుగుతున్నది. ఆ కోరిక కర్మకు కారణ మౌతున్నది. మన ప్రయత్నంచేత ఒక కోరికను మనం ఉత్పాదించగలం. ఆ కోరికను మార్చగలముకూడ. జ్ఞానమును మనం ఉత్పాదించలేము ; జ్ఞానమును మార్చలేము.

అందుచేత ఇచ్ఛాద్వేషములు, సుఖదుఃఖములు ద్వంద్వములు, 'ద్వంద్వై ర్విముక్తై స్సుఖదుఃఖసంజ్ఞైః '- ఈ ద్వంద్వముల పరిధిలోనుంచి మనం బయటపడాలి. ఈ ద్వంద్వములన్నీ - ఇతరములను చూచుటవల్ల కలుగుచున్నది. ఇచట నానాత్వమేమిలేదు- నేహ నానాస్తి కించన- అని ఉండ కలిగితే మనకు కోరికలేదు ; భయంలేదు. 'తత్ర కోమోహః కః శోక ఏకత్వ మనుపశ్యతః ' 'ఆత్మా వా ఇద మేక ఏవాగ్ర ఆసీ న్నాన్య త్కించన.' ఏకం స ద్విప్రా బహుధా వదంతి. 'ఏకం సన్తం బహుధా కల్పయన్తి' 'ఏకో దాథార భువనాని విశ్వా' - స దేవ సోమ్యేద మగ్ర ఆసీ దేక మేవా ద్వితీయమ్‌'- అని శ్రుతులు ఏకత్వమును, అద్వయమును- అద్వైతమును బోధించుచున్నవి.

ఈ మనస్సును మనం అటుఇటూ పోనీక, ఆత్మయందే నిలుపవలెను 'ఆత్మ న్యేవ వశం నయేత్‌' అని భగవద్వాక్యము. 'యస్మిన్‌ విజ్ఞాతే సర్వ మిదం విజ్ఞాతం భవతి'- ఏది విజ్ఞాత్‌ మగుచుండగా సర్వమూ విజ్ఞాత మగునో? అని శ్రుతి చెప్పినందున ఏక విజ్ఞానముచేత - అనగా అద్వైతజ్ఞానము చేత, అంతఃకరణము నిరుద్ధసామర్థమై వాసనా రహితమై ప్రశాంతరహిత మగును. 'ప్రశాంతమనసంహ్యేనం' శాంత మొందిన మనస్సు కలవానిని.

''పృథివ్యప్తేజో2 నిలభే సముత్థితే

పంచాత్మకే యోగగుణ |

ప్రవృత్తేన తస్య రో గొ న జరా న మృత్యుః

ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం ||

పంచభూతములు సముత్థితము లైనపుడు అనగా పంచాత్మక యోగగుణములు ప్రవృత్తము లైనపుడు యోగియొక్క శరీరము యోగాగ్నిమయ మగును. అపుడు రోగము, ముసలితనము, చావు ఉండవు అని శ్రుతి.

ఈశ్వరుడు అంతర్యామి రూపమున అన్నిటిని ప్రేరేపించునట్టివాడు. బృహదారణ్యము- ''యః సర్వేషు భూతేషు తిష్ఠన్‌ యః సర్వాణి భూతా న్యంతరో యమయతి'' - అని అనుచున్నది. ఎవడు సర్వభూతములలో నుండి వానిని ప్రేరేపించునో - అని శ్రుతి.''ఈశ్వరస్సర్వ భూతానాం హృద్దేశే 2 ర్జునతిష్ఠతి'' అని గీతలో భగవద్వాక్యము. ఇట్లు ఈశ్వర ప్రేరితులగు జీవులు భూతశబ్దవాచ్యులు, తత్కార్యమగు అంతఃకరణము అనునట్టి ఉపాధియందు ప్రతిబించిన చైతన్య రూపులు, జాగ్రదాది. అవస్థాభిమానులు. ఈ జీవులు అఖండ బ్రహ్మసాక్షాత్కార సమయమునందు అభేదానుభవము నొందుదురు. 'తత్త్వమసి' 'అహం బ్రహ్మస్మి' 'సర్వం ఖల్విదం బ్రహ్మం' మొదలగు మహావాక్యములన్నియు ఈ జీవ బ్రహ్మాభేదమునే ప్రతిపాదించుచున్నవి. శంకరాచార్యులవారు

శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తి గ్రంథ కోటిభిః |

బ్రహ్మ సత్యం జగన్నిథ్య జీవో బ్రహ్మైవ నాపరః ||

అని ఘంటాపథముగా చాటినాడు. అంతేకాక, '' ఆత్మాశం సతతం జానన్‌ కాలం నయ మహామతే'' అనియు బోధించారు.

ఈ అద్వైతసిద్ధి లభించు టెట్లు?

'య త్సాక్షాదపరోక్షాత్‌ బ్రహ్మ' అని బృహదారణ్యకము. బ్రహ్మము సాక్షాత్‌ స్వరూపము, పరోక్షముగాదు. ఆ బ్రహ్మమును సాక్షాత్కరించుకోనుట ఎట్లు? ''గుహానివాతాశ్రయేణ ప్రయోజయేత్‌'' గుహ మొదలైన నివాతాది స్థలములందు ధ్యానము చేయవలయు నని శ్రుతి. లలితా త్రిశతిలో అమ్మ వారికి 'ఏకాంతపూజితా' అను నామ మొకటి వున్నది. ఏకాంతమున, సర్వము ప్రవిలాపన మొందు సమయమున 'యం లబ్ధ్వాచాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్‌ స్థితో' న దుఃఖేన గురుణాపి విచాల్యతే అన్న యోగావస్థలో 'కచ్చి ద్ధీర ః ప్రత్యగాత్మాన మైక్షద్‌ ఆవృత్త చక్షురమృతత్వమిచ్ఛన్‌' ఒకానొక ధీరుడు అమృతత్వమును కోరుకొని, అంతర్దృష్టి అలవరచుకొని ప్రత్యగాత్మను కనుగొనును' అని శ్రుతులు అద్వైతసిద్ధికి మార్గమును ఉపదేశించుచున్నవి.

'అవృత్త చక్షుః' ఉపనిషత్తు ఎంత చక్కగా చెప్పు చున్నది? 'అవృత్త చక్షుః అన్న పదము చెవులలో పడినపుడెల్లా, నాకు స్వాములవారే కనబడుతారు. 'కశ్చి ద్ధీరః-' అన్నప్పుడూ వారి స్వరూపమే కనబడుతుంది. ఈ ధీరుడు-'సింహోరస్కం వృషస్కంధం' అనే వర్ణనకు అనుగుణంగా లేదు. ఈ ధీరుడు ఉపవాస కృశుడు. ఉజ్జ్వల తపోనిష్ఠాగరిష్ఠుడు. తేజస్వి, మౌని, బ్రహ్మవిద్యా సంప్రదాయ ప్రవర్తకుడు, ఋషి, ఋషయో మంత్రద్రష్టారః' - ఋషులు మంత్రద్రష్టలు. ఈ ఋషి దర్శించిన మంత్రమేమి?

స్వాములవారు దుర్గా ప్రతిష్ఠ సందర్భములో ఈ మంత్రములను వ్రాశారు.

శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రమ్‌

తే ధ్యానయోగానుగతా అపశ్యన్‌

త్యా మేవ దేవీం స్వగుణౖ ర్నిగూఢాం,

త్వ మేవ శక్తి ః పరమేశ్వరస్య

మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి

దేవాత్మశక్తి ః శ్రుతివాక్యగీతా

మహరిలోకస్య పురః ప్రసన్నా,

గుహా పరంవ్యోమ సతః ప్రతిష్ఠా

మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి

పరాస్య శక్తిః వివిధైవ శ్రూయతే

శ్వేతాశ్వ వాక్యోదిత దేవి దుర్గే

స్వాభావిక జ్ఞాన బలక్రియా తే

మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి

దేవాత్మ శ##బ్దేన శివాత్మభూతా

య త్కూర్మ వాయవ్య వచో వివృత్యా.

త్వం పాశ విచ్ఛేదకరీ ప్రసిద్ధా

మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి

త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ

బ్రహ్మప్రతిష్ఠా స్యుపదిష్టగీతా,

జ్ఞాన స్వరూపాత్మతయాఖిలానాం

మాం పాహి విశ్వేశ్వరి మోక్షదాత్రి

'శ్వేతాశ్వవాక్యోదిత' దేవి దుర్గే అని అమ్మవారిని స్వాములవారు సంబోధిస్తున్నారు. మనబోటి చరిత్రహీనులకు (అంటే చరిత్ర జ్ఞానము లేని వారికి) శ్వేతాశ్వతర ఋషి ఏ విధంగా వుండేనో ఊహించుటకు కూడా అలవికాదు. కాని శ్వేతాశ్వతరుడన్నపుడు స్వామి మంద హాసకవిత ముఖారవిందము నయనగోచర మౌతుంది.

ఈ శ్వేతాశ్వవాక్యోదిత దుర్గాదేవి ఎవరు? ఈమె పాదములనుబట్టి స్వాములవారు పరవశించుటకు కారణమేమి?

భూతాని దుర్గా భువనాని దుర్గా

స్త్రియో నర శ్చాపి పశు 2 శ్చ దుర్గా |

యద్య ద్ధి దృశ్యం ఖలు సైవ దుర్గా

దుర్గాస్వరూపా దపరం న కించిత్‌ ||

ఈ భూతములు, భువనములు, స్త్రీలు, పురుషులు, పశువులు, దృశ్యప్రపంచము, సమస్తము దుర్గాస్వరూపమే. దానికి పరమైనది వేరేదియూలేదు. దుర్గ అనగా ఏక ప్రాభవశాలిని. ప్రభువు యొక్క భావము ప్రాభవము. రక్షకత్వము. ఏక మనగా ఇతరుల కసాధ్యము. ఎవరికి అఖండ చైతన్యము కలదో అది ఏకప్రభావము. 'పాదోస్య సర్వా భూతాని' సర్వభూతములు బ్రహ్మ యొక్క అంశలు. 'ఏకాంశేన స్థితోజగత్‌' బ్రహ్మయొక్క ఏకాంశమున - ఏకపాదమున. స్థితమై యున్న జగత్తునకు సార్వభౌమత్వమును వహించిన పరమేశ్వరియే దుర్గ. 'య చ్ఛక్షుషా న పశ్యతి' ఆమె కంటితో చూడబడనది. అహంకారోదగ్రులైన దేవతలకు సహితము ఆమె కానరాలేదు. విదళితాహంకారుడైన దేవేంద్రునికి మాత్రమామె శోభమానయై - ఈషత్‌ స్మితానవయై హైమావతియై గోచరించినది. మంత్రమునకు మంత్రదేవతకు అభేదమని శాస్త్రము మంత్రద్రష్టకు మంత్రి దేవతా దర్శనము కావలెను.

'ఓం నమః పరమ ఋషి భ్యో నమః'

'ఓం మంత్రకృద్భ్యో నమః'

స్వాములవారిది శాక్తి ద్వైతమా? శివాద్వైతమా? లేక కనివిని ఎరుగని మధుసూదనసరస్వతుల వలె - వైష్ణవాద్వైతము ఏ మూర్తియందు వారికి ప్రియము? అంటే- ఈ విషయంలో వారు ఏతత్త దిత్యనిర్దేశ్యంగా ఉండిపోతారు. వారి ఉపన్యాసాలను చూస్తే శివుడినిగూర్చి చెప్పేటపుడు పరిపూర్ణ శివభావనలో ఉంటారు. ఒకపుడు శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునక్షేత్రంలో స్థిరంగా ఉండిపోవాలని కూడా అనుకొన్నాను. చేసేది మాత్రం సతత నారాయణస్మరణ వారి హృదయం, హార్దసంతామసాపహా- అని పేరొందిన అమ్మవారి వశంలో వుంటుంది. బొజ్జగణపతి అంటే వారికి వాత్సల్యంతో కూడిన భక్తి. ఒక చెట్టును సులభంగా పెరికి ఒక చిన్న సూదిని ఆ విధంగానే ఎత్తడానికి ఏ యంత్రమునకు గాని వ్యక్తికిగాని చేతకాదు ; కాని ఏనుగు ఈ రెండుపనులనూ సులభంగా చేయగలదు. అటువంటి ఏనుగు మొగము గల వేలువు అంటే, స్వాములవారికి మోదకం తిన్నట్లు వుంటుంది. తర్వాత 'స్వామి గజముఖానుజ' అని అమరసింహుడు చెప్పిన సుబ్రహ్మణ్యుడంటే స్వామికి చాలా ప్రీతి. స్కందలీలీ వైభవము అనే ఉపన్యాసము చదివితే, స్కాందములోని వారిలోతు అగుపడుతుంది. ఆదిశంకరుల వారికి - 'అంతశ్శాక్తః బహిశ్శైవః సభాయాం వైష్ణవోత్తమః ' అని ప్రతీతి ఉండేదట! ఆయన అడుగుజాడలలో నడిచే స్వాములవారూ అదేవిధంగా వుంటారు. ఈ ముమ్మూర్తులను మూడురత్నములను ఉమా మహేశ్వర నారాయణులను మనం ఉపాసించాలని వారు ఆదేశిస్తారు.

ఈ పది పుస్తకములతో పద్దెనిమిది ఏళ్ళక్రితం లేచిన జగద్గురుబోధలు అనే వీచిక అధ్యాత్మిక వాఙ్మయాంబుధిలో లయమై పోవుచున్నది. ఈ ఉద్యమము శుభాంత మగునట్లు అనుగ్రహించిన స్వాములవారికి ప్రణామసహస్రములు. ఈ పుస్తకములను ప్రచురించిన సాధన గ్రంథ మండలికి, వ్యవస్థాపకులు శ్రీ యుతులు బులుసు సూర్యప్రకాశ శాస్త్రిగారికి నా కృతజ్ఞతా పూర్వక నమోవాక్యములు. ఈ గ్రంథముల నాదరించి ప్రయోజనోపలబ్ధి నొందిన ముముక్షులోకమునకు హార్దృకవందనము.

శ్రుతిస్మృతి పురాణానా మాలయం కరుణాలయం |

నమామి భగవత్పాద శంకరం లోకశంకరమ్‌ ||

ఇత్యేషా వాఙ్మయీ పూజా శ్రీ మచ్ఛంకరపాదయో |

అర్పితా తేన మే దేవః ప్రీయతాం చ సదాశింః ||

జయ జయ జగదంబ శివే

జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతె,

జయ జయ మహేశదయితే

జయ జయ చిద్గదన కౌముదీధారే.

''శివ శంకర దేశిక మే శరణం''.



బొంబాయి

సిద్ధార్థి - ఫాల్గుణశుద్ధషష్ఠి ''విశాఖ''

21-2-1980


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page